ఈ భూమిపై ఎన్నో వింతలు విశేషాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అలాంటి జరిగినపుడు వాటిని చూసేందుకు జనాలు బారులు తీరుతుంటారు. దాని గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. వాటిని తరువాత తరానికి చేరవేస్తుంటారు. మానవ నాగరికత ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అలానే జరుగుతున్నది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా పొదలకుదురు మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఉన్న మాసూమ్షావలి దర్గాలో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఈ దర్గాలో ఇటీవలే గంధమహోత్సవం జరిగింది. ఇది జరిగిన కొన్ని రోజులకు ఆ దర్గాలోని సమాధి నుంచి విచిత్రంగా శబ్దాలు రావడం మొదలుపెట్టాయి. ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉండే శబ్దాలు రావడంతో అందరూ షాక్ అయ్యారు.
ఈ శబ్దాలతో పాటు సమాధిపై ఉన్న వస్త్రం, పువ్వులు పైకి కిందకు కదలడంతో.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి.. గ్రామంలో అందరికి తెలిసింది. రాత్రిపూట మాత్రమే ఇలాంటి శబ్దాలు వస్తున్నాయని తెలియడంతో... ప్రజలు అక్కడికి చేరుకొని వింతను చూసేందుకు బారులు తీరారు.
రాత్రి సమయంలోనే కాకుండా ఉదయం సమయంలో కూడా సమాధి నుంచి ఊపిరి పీల్చుకుంటున్న శబ్దం రావడంతో పాటు వస్త్రం కదులుతుండటంతో... జనాలు షాక్ అయ్యారు. గతంలో కూడా ఇలానే జరిగితే దాన్ని కొంతమంది విజ్ఞానవేత్తలు కొట్టిపారేశారు. సమాధిలో వేడిగాలి రావడంతో అది బయటకు వెళ్లే సమయంలో అలా జరుగుతుందని అన్నారు. ఇప్పుడు మరోసారి ఇలా జరగడంతో దర్గాలో మహిమలు ఉన్నాయని చెప్పి వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు.