రొట్టెలపండుగ సంబరాలకు నెల్లూరు ముస్తాబవుతోంది. బారాషాహీద్ దర్గాలో రొట్టెలపండుగ ఏర్పాట్లను  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ఈ నెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రొట్టెలపండుగ వేడుకగా జరుగుతుంది చెప్పారు. బారాషాహీద్ దర్గా ప్రాంగణంలో రాజకీయ ఫ్లెక్సీల ఏర్పాట్లు చేయవద్దని నిర్వాహకులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను చెయ్యాలన్నారు. ఈ మేరకు  ఎమ్మెల్యే  శ్రీధర్ రెడ్డి అధికారులకు సూచించారు. అయన వెంట విజయ డైరీ ఛైర్మెన్ కొండ్రెడ్డి రంగా రెడ్డి, వై.సి.పి. జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రూప్ కుమార్ యాదవ్ మరియు నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర రావు తదితరులు ఉన్నారు.




రొట్టెల పండుగను సమర్థంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్‌ శేషగిరిబాబు తెలిపారు. ఇప్పటికే తన  క్యాంపు కార్యాలయంలో ఈ పండుగపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రొట్టెల పండుగను రాష్ట్ర స్థాయి పండుగగా ప్రకటించిందని వెల్లడించారు. ఐదు రోజులు ఈ పండుగ జరుగుతుందన్నారు. ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. లక్షలాది భక్తులు బారాషాహీద్‌ దర్గా, స్వర్ణాల చెరువుకు వచ్చే అవకాశం ఉన్నందున పండుగ రోజులలో తొక్కిసలాట జరుగకుండా, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.





యాత్రికులకు భద్రత కల్పించటంతో పాటు, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలన్నారు. బోటింగ్‌ వద్ద లైఫ్‌ జాకెట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్య సదుపాయం కల్పించాలన్నారు. జిల్లా చరిత్ర, సంస్కృతి, పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కార్యక్రమాలు వివరించే ఛాయాచిత్ర పదర్శన ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమైన ప్రదేశాలలో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. పండుగ రోజులలో గట్టి భద్రత ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్‌ శేషగిరిబాబు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వీరభద్రరావు, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఇస్మాయిల్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: