వివాదాస్పదంగా మారిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం సోమవారం మరికొద్ది నిమిషాల్లో జరగనున్నది. ఇప్పటికే ఇరువురు సభ్యులు టిటిడి బోర్డు డైరెక్టర్లుగా బాభ్యతలు చేపట్టారు. టీటీడీ నూతన ధర్మకర్తల మండలి సభ్యులు తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ప్రమాణస్వీకారం చేయడానికి సమాయత్తమయ్యారు. ఈ క్రమంలో టీటీడీ నిర్ణయించిన విధంగా ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య ఒకరిద్దరు మినహా మిగిలిన సభ్యులు కుటుంబ సమేతంగా వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయానికి చేరుకుంటారు. బంగారువాకిలి చెంత సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
కాగా శనివారం ముగ్గురు సభ్యులు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భాగంగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా)ఛైర్మన్ మరియు ప్రభుత్వ చీఫ్ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీవారి ఆలయంలో టిటిడి ట్రస్ట్ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత శ్రీ కృష్ణమూర్తి వైద్యనాథన్ ఉదయం 10:50 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, శ్రీమతి ప్రశాంతి రెడ్డి 11.00 గంటలకు ఆలయం ప్రమాణం స్వీకారం చేశారు. టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి బసంత్ కుమార్ సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయం వెలుపల ధర్మకర్తల మండలి సభ్యులు మీడియాతో మాట్లాడారు.
చెవిరెడ్డి. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి ఆస్థానంలో సేవలందించే అవకాశం 3వసారి తనకు రావడాన్ని పుర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తున్నట్టు చెప్పారు. తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు సౌకర్యావంతమైన దర్శనం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కృష్ణమూర్తి శ్రీవారి భక్తులకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు శ్రీ వేంకటేశ్వరస్వామివారికి కృతజ్ఞతలు తెలిపారు. వి.ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో సామాన్య భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. బాధ్యతాయుతంగా తన విధులు నిర్వహించేందుకు కావాల్సిన శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలియజేశారు.