తిరుమల తూరుపతి దేవస్థానం పాలకమండలి ఈ సారి బ్రహ్మోత్సవాలను ప్రతిస్త్మాకంగా నిర్వహిస్తుంది. అందుకు అనుగుణంగా భారీ స్థాయిలో ఆలయాన్ని ముస్తాబు చేస్తుంది. ఈ క్రమంలో చేసిన విద్యుత్ అలంకరణల ఏర్పాట్లతో తిరుమల క్షేత్రం కళకళలాడుతోంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి ఆలయంతో పాటు తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్ నుంచి మాడవీధుల వరకు ఏర్పాటు చేసిన విద్యుత్వెలుగులతో కొండ కనువిందు చేస్తోంది.ఆలయ మహాగోపురంతో పాటు ప్రాకారం, ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక విద్యుత్ అలంకరణలు చేస్తున్నారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సెప్టెంబరు 29వ తేదీ ఆదివారం రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్న విషయం తెలిసిందే. శాస్త్రాల ప్రకారం ఏదైనా ఉత్సవానికి 9, 7, 5, 3 రోజులు లేదా ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ. ఖగోళశాస్త్రంలోని సిద్ధాంతాల ప్రకారమే ఇలా చేస్తారు. మొక్కలకు అధిదేవత చంద్రుడు కాబట్టి రాత్రి సమయంలోనే విత్తనం నాటుతారు.
అలాగే వివిధ ప్రాంతాల్లో దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేశారు. పార్కులు, వాటర్ ఫౌంటెన్లు విద్యుత్ కాంతుల్లో ప్రత్యేక అందాలు సంతరించుకున్నాయి. ప్రధాన కూడళ్ళలో భారీ కటౌట్లు, సప్తద్వారాలు, రోడ్లకు ఇరువైపుల ఎల్ఈడీ విద్యుత్దీపాలంకరణలు ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. సంబంధిత సిబ్బంది అలంకరణల నాణ్యతను గత మూడు రోజులుగా పరిశీలిస్తూ, గుర్తించిన లోటుపాట్లను సవరిస్తున్నారు. మరో రెండురోజుల్లో ఆలయ ప్రాకారం, గోపురం, లోపలి భాగాల్లోని విద్యుత్ అలంకరణ పనులు కూడా పూర్తిచేయనున్నారు.