విజయవాడలోని ఇంద్రకీలాద్రిపైన  శరన్నవరాత్రి ఉత్సవాల ఆరంభంలోనే అపశృతి చోటు చేసుకుంది. ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ చిన్న చిన్న పొరపాట్లు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఇంద్రకీలాద్రిపై కలకలం రేగింది. దుర్గగుడి పులిహోర తయారీ కేంద్రంలో వంట గ్యాస్ లీక్ అయింది. ఈ కేంద్రంలో దాదాపు 40 నిండు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. 50 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. గ్యాస్ లీకును వెంటనే గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. వెంటనే పైపు లైను మూసేశారు.



దీంతో పులిహోర తయారీ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు మరమ్మత్తుపనులు చేపట్టారు. పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనాస్థలిని ఈవో సురేష్ బాబు పరిశీలించారు.కాగా ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం స్నపనాభిషేకంతో ప్రారంభమయ్యాయి.



10 రోజుల పాటు పది అలంకారాల్లో కనక దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలిరోజైన ఆదివారం అమ్మవారు స్వర్ణకవాచాలంకృత దుర్గాదేవిగా దర్శనమివ్వనున్నారు. ప్రతిరోజు ఉదయం 3గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: