జగదభిరాముడు.. కోదండ రాముడు.. రఘురాముడు.. ఇలా అనేక  పేరుతో పిలిచినా పలికే నీలమేఘశ్యాముడు శ్రీరాముడు చంద్రుడు. పితృవాక్య పరిపాలన అనే మాటకు అర్థం చెప్పిన మహానుభావుడు శ్రీ రాముడు. అటువంటి ఏకపత్నీవ్రతుడు శ్రీరామచంద్రమూర్తి కల్యాణమంటే జగమంతా కళ్యాణమే. దక్షిణ అయోధ్యగా పిలవబడిన  భద్రాచలంలో శ్రీరామనవమి రోజున నిర్వహించే సీతారాముల కల్యాణం చూసినా, వినినా  కూడా ఎంతో పుణ్యం అని అందరు అంటూ ఉంటారు. అంతటి కల్యాణ ఘట్టంలో తమకు ఏదో ఒక రకంగా భాగస్వామ్యం కావాలని ఎంతో మంది కోరుకుంటారు. 


ఇక కల్యాణంలో ప్రధానంగా  వినియోగించేవి తలంబ్రాలు. ఆ తలంబ్రాలను గోటితో ఒలిచే మహద్భాగ్యం క్షీరపురి వాసులకు ఆరోసారి లభించింది.  చీరాలకు చెందిన రఘురామభక్త సేవా సమితి చైర్మన్‌ పొత్తూరి బాలకేశవులు 2013లో శ్రీరామనవమి కల్యాణం తిలకించేందుకు భద్రాచలం వెళ్లారు. అక్కడ కల్యాణంలో స్వామివారికి గోటితో ఒలిచిన తలంబ్రాలను ఉభయ గోదావరి జిల్లాలతోపాటు పలు జిల్లాల నుంచి భక్తులు దేవస్థానానికి సమర్పించారు. 


ఆ అవకాశాన్ని తమకు అందించాలని ఆయన దేవస్థాన సభ్యులను  కోరారు. దీంతో 2014లో చీరాల వాసులకు అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కల్యాణానికి చీరాల నుంచి కూడా గోటి తలంబ్రాలు స్వామివారికి అందుతున్నాయి. 2020లో జరిగే కల్యాణానికి కూడా ఆరోసారి ఆ అదృష్టం చీరాల వాసులకు లభించింది. ఈ మేరకు దేవస్థాన అధికారుల నుంచి అనుమతి లభించింది. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం వడ్లను గోటితో ఒలిచే కార్యక్రమాన్ని మహిళలు అపుడే ప్రారంభం కూడా చేశారు. 


వచ్చే సంవత్సరం 2020లో భద్రాచలంలో  నిర్వహించే శ్రీరామనవమి పర్వదినానికి ఉపయోగించే తలంబ్రాలను 150 క్వింటాళ్లకు ఆలయ అధికారుల నుంచి అనుమతి వచ్చింది. కల్యాణానికి వినియోగించే మొత్తం 150 క్వింటాళ్ల తలంబ్రాలు క్షీరపురి వాసులే అందించడం కోటి నోములు ఫలం. తలంబ్రాలతోపాటు పసుపు 225 కిలోలు, కుంకుమ 450 కిలోలు, గులాం 450 కిలోలు, నూనె 225 కిలోలు, సెంటు(జాస్మిన్‌) 75 లీటర్లు, రోజ్‌ వాటర్‌ 75 లీటర్లు, 100 కిలోల లోపు ముత్యాలు అందించాలని అనుమతి పత్రంలో ఆలయ అధికారులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: