తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే సాధారణ భక్తులకు కూడా వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. అయితే దీని కోసం శ్రీవాణి ట్రస్ట్‌కు పది వేల రూపాయల విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. విరాళం ఇచ్చిన తేదీ నుంచి ఆరు నెలల్లోగా వీఐపీ బ్రేక్ దర్శన సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్చు. 


తిరుమల శ్రీనివాసుడిని కులశేఖరపడి కావలి వరకు వీవీఐపీలు దర్శించుకునే తీరులోనే సామాన్యభక్తులకూ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.  అయితే ఈ దర్శనానికి భక్తులు 10 వేలు విరాళంగా ఇవ్వాల్సి వుంటుంది. శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం కోసం శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు. శ్రీవాణి పథకానికి 10వేలు విరాళంగా ఇస్తే.. వీఐపీ బ్రేక్‌ దర్శనం టిక్కెట్‌ అందిస్తామని తెలిపారు. దీని కోసం గోకులం కార్యాలయంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నవంబర్‌ తొలి వారంలో శ్రీవాణి ట్రస్ట్‌ పథకానికి సంబంధించిన యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తారు. మొదటి 15 రోజులు పాటు తిరుమలలో కరెంట్‌ బుకింగ్‌ విధానంలో టిక్కెట్లను అందించనున్నట్టు చెప్పారు. 


శ్రీవాణి ట్రస్ట్‌కు వచ్చిన విరాళాలతో ఆలయాల పరిరక్షణ, నిర్మాణాలకు వినియోగిస్తామన్నారు. విరాళాలు ఇచ్చిన భక్తుడికి ప్రోటోకాల్‌ పరిధిలో పరిగణిస్తూ దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. విరాళంగా 10 వేలు చెల్లించడంతో పాటు.. 500 రూపాయల టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక నెల ముందుగానే కోటాను విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది. మొత్తం మీద కొత్త పథకం శ్రీవారి భక్తులకు శుభవార్తే అని చెప్పాలి. ఇప్పటి వరకు పలుకుబడి వున్న వారికే పరిమితమైన బ్రేక్ దర్శనాలు ఇకపై సాధారణ భక్తులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: