భారత్ అమ్మాయి పాక్ క్రికెటర్ పెళ్లి చేసుకుంటే ఆ హంగామానే వేరుగా ఉంటుంది. ఇప్పటికే భారత టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాక్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి రెండు దేశాల్లో పెద్ద సంచలనమే అయ్యింది. పెళ్లి జరిగాక కూడా ప్రతి విషయంలోనూ రెండు దేశాల ప్రజలు వీరిని ఎప్పుడో ఓ సారి ఏదో ఒక కాంట్రవర్సీలోకి లాగుతూనే ఉంటాడు. ఇక ఇప్పుడు మరో పాక్ క్రికెటర్ భారత యువతిని పెళ్లాడేందుకు రెడీ అవుతున్నాడు.
పాకిస్థాన్ యువ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ ఇప్పటికే భారత్ కు చెందిన యువతితో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నట్లు సమాచారం. ఆలీ తాను ప్రేమించిన భారత యువతిని ఆగస్టు 20 దుబాయ్లో పెళ్లి చేసుకోబోతున్నాడట. ఈ పెళ్లి వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది ప్రత్యేక అతిథుల సమక్షంలో జరగనుంది. ఈ వేడుక అట్లాంటిస్ ఫామ్ హోటల్లో జరగనున్నట్లు హసన్ అలీ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.
ట్విస్ట్ ఏంటంటే ఇంగ్లండ్లో ప్రపంచకప్ జరుగుతున్నప్పుడే ఆలీ భారత్లోని హర్యానాకు చెందిన షామియా అర్జు(25) తో హసన్ అలీకి పరిచయం ఏర్పడిందట. ఇంగ్లాండ్లోని మానవ్ రచన యూనివర్సిటీ నుండి షామియా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ లో ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఇంగ్లండ్లో ఆలీకి షామియా ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యిందట.ఇలా రెండు నెలల్లోనే వీరు ప్రేమించేసుకుని పెళ్లికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
ఇక ఇప్పటికే సానియా - షోయబ్ జంట ఎప్పుడూ వివాదాల్లో ఉండడంతో ఇప్పుడు ఈ భారత్ - పాక్ జంట సంసారం ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా ఉంది. ఇక షోయబ్ మాలిక్, హసన్ అలీలే కాకుండా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు జహీర్ అబ్బాస్, మొహసీన్ ఖాన్ లు కూడా భారత్ కు చెందిన అమ్మాయిలనే పెళ్లాడారు. అయితే వీరు ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకోలేదు.