ధోని తన రిటైర్మెంట్ గురించి తేల్చుకోలేని స్థితిలో ఉన్నాడా? మాజీ క్రికెటర్లు మిస్టర్ కూల్ రిటైర్ గురించి ఎందుకు అంత ఆసక్తి చూపిస్తున్నారు..? ధోని మనసులో ఏముంది ? నవంబర్ దాకా సెలక్షన్కు అందుబాటులో ఉండనని ప్రకటించిన జార్ఖండ్ డైనమైట్ రిటైర్మెంట్ విషయంలో తటపటాయిస్తున్నాడా..? ప్రస్తుత భారత క్రికెట్లో ఎం.ఎస్ ధోని కెరీర్ గురించే ఎక్కువ చర్చ నడుస్తుందనేది కాదనలేని వాస్తవం.
భారత క్రికెట్కు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించి.. తనకంటూ ప్రత్యేక ముద్ర సంపాదించుకున్న మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోని రిటైర్మెంట్ గురించి గత కొంత కాలంగా కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వరల్డ్కప్ నుండి ధోని రిటైర్మెంట్ వార్తలు మొదలయ్యాయి. మెగాటోర్నీ అనంతరం ధోని రిటైర్ అవ్వడం ఖాయమని అందరూ భావించారు. దీనికి తోడు ధోని అటతీరు కూడా తోడవ్వడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీనిపైన ధోని ఏనాడూ స్పందించలేదు. అయితే తాజాగా మళ్ళీ ధోని రిటైర్మెంట్ వార్తలు తెరపైకి వచ్చాయి. కొద్ది రోజుల క్రితం ధోని రిటైర్మెంట్ పై ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వీటిపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్.ఎస్.కె ప్రసాద్ వివరణ ఇచ్చేంత వరకు ధోని రిటైర్పై వార్తలు ఆగలేదు.
ప్రతీ క్రీడాకారుడు తప్పించుకోలేని దశ ఒకటుంటుంది. అదే ప్రాణంగా ప్రేమించిన ఆటకు వీడ్కోలు పలకడం. ఇన్నాళ్లూ తనకన్నీ ఇచ్చిన ఆటను వదిలేయడం అంత తేలికేమీ కాదు. ఎంతో బాధ ఉంటుంది. అద్భుతమైన ఆటగాళ్లతో నిండిన భారత క్రికెట్ రంగంలో కొందరు స్టార్లు మాత్రం దీనిని ఎందుకో అర్థం చేసుకోలేకపోతున్నారు. ధోనీని చూస్తే రిటైర్ మెంట్ గురించి సరియైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడనే వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ధోనీ వయసు 38. రెండు నెలలుగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. నవంబర్ వరకు అందుబాటులో ఉండడు. బంగ్లాదేశ్ సిరీస్కూ దూరమే. ఇప్పటికే సీనియర్, భారత్—ఏ జట్ల కోసం మ్యాచ్ల షెడ్యూలు, శిక్షణ, డోపింగ్ నిరోధ పరీక్షల ప్రణాళికలను బీసీసీఐ సిద్ధం చేసింది. ఇందులో ఎక్కడా ధోనీ పేరు లేదు. మరోవైపు మాజీ క్రికెటర్లు ధోని రిటైర్పై భిన్నస్వరాలు వినిపిస్తున్నారు.
అంతర్జాతీయ క్రికెట్కు ధోని వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసిందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ధోని 38ఏళ్ల వయసులో ఉన్నాడు. వచ్చే టీ20 వరల్డ్కప్ నాటికి ధోనికి 39 ఏళ్లకు చేరతాడు. ఈ వయసులో క్రికెట్ ఆడటం చాలా కష్టమని గవాస్కర్ తెలిపాడు. ధోని రిటైర్మెంట్కు విలువ దక్కాలంటే అతనే తొందరగా నిర్ణయం తీసుకోవాలని సన్నీ సూచించాడు. గంగూలీ మాత్రం ధోని వచ్చే టీ-20 వరల్డ్కప్లో ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఈ ప్రశ్నలన్నింటికీ ధోనినే సమాధానం చెప్పాలి. మరి మిస్టర్ కూల్ మహీ మదిలో ఏముందో ఆ దేవుడికే తెలియాలి.