రెండు రోజుల క్రితం వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా బ్రిజేష్ పటేల్ ఎన్నిక లాంఛనమే అనుకున్నారు. కానీ అనూహ్యంగా రేస్ లోకి వచ్చి గంగూలీ బీసీసీఐ పాలనా పగ్గాలు ఎగురేసుకెళ్లాడు. ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడిగా అతని ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. 2000 సంవత్సరంలో ఫిక్సింగ్ ఆరోపణలలో కూరుకుపోయి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోవడంతో భారత క్రికెట్ జట్టు మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. అంతటి క్లిష్ట సమయంలో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి గంగూలీ ఆట వైపు అందరి దృష్టిని నిలిపేలా చేశాడు. కెప్టెన్ గా అతను భారత జట్టు కు చేసిన సేవలు అన్నిఇన్ని కాదు.. ఓ రకంగా చెప్పాలంటే ప్రస్తుత భారత క్రికెట్ జట్టు ఇప్పుడు ఈస్థాయిలో ఉందంటే దానికి కారణం గంగూలీనే.. 5ఏళ్ళ కెప్టెన్సీ కాలంలో దూకుడుగా వ్యవహరించి కఠిన నిర్ణయాలతో టీం ను ఉన్నత స్థాయికి తీసుకొచ్చాడు. అంతేకాదు టీం లోని ఆటగాళ్లలో స్థైర్యాన్ని నింపాడు.. యువ ఆటగాళ్లను ప్రోత్సహించాడు. అయితే 2005లో గంగూలీ కెప్టెన్సీ కోల్పోవడంతో జట్టులో అతని స్థానం గల్లంతైయింది. 2006లో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చినా ఆతరువాత 2008లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఈక్రమంలో ఐపీఎల్ రూపంలో మరో నాలుగు ఏళ్ళు క్రికెట్ లో కొనసాగిన ... ఆతరువాత పూర్తి స్థాయిలో రిటైర్మెంట్ ప్రకటించాక తన గురువు ధాల్మియా అండతో బెంగాల్ క్రికెట్ ఆసోసియేషన్ (క్యాబ్ ) కు అధ్యక్షుడిగా ఎన్నికైయ్యాడు. ఇటీవలే మళ్ళీ ఆపదవిని గంగూలీ రెండో సారి చేపట్టాడు. అయితే ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాల్సి ఉండడం తో క్యాబ్ అధ్యక్షుడిగా అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్ గా కూడా దాదా తప్పుకోనున్నాడు.
ఇక ఇప్పుడు బీసీసీఐ అద్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న గంగూలీ ముందు పెద్ద సవాళ్లే వున్నాయి. 2013 ఐపీఎల్ లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ తో బోర్డు ప్రతిష్ట దిగజారింది. ఈ ఉదంతంతో సుప్రీం కోర్టు సీన్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఆ తరువాత పాలనా వ్యవహారం లోధా కమిటీ చేతుల్లోకి వెళ్లడంతో శ్రీనివాసన్ , అనురాగ్ ఠాకూర్ తో పాటు మరి కొందరు బలమైన పాలకులు బీసీసీఐ నుండి తప్పుకున్నారు. ఆతరువాత బీసీసీఐ క్రమంగా బలహీనపడింది. ఒకప్పుడు ఐసీసీ కూడా బీసీసీఐ ను కాదని స్వంతంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి కానీ ఇప్పుడు అదే ఐసీసీ , బీసీసీఐ ని పట్టించుకోవడంలేదు. అలాగే లోధా కమిటీ చేసిన కొన్ని సంస్కరణలు క్రికెట్ అభివృద్ధికి ప్రతికూలంగా మారాయి అనే ఆరోణలు కూడా వున్నాయి. మరి వీటన్నింటిని ప్రక్షాలను చేసి బీసీసీఐ ను మళ్లీ తిరుగులేని శక్తిగా మార్చాలంటే గంగూలీ కి అంత ఈజీకాదు. పైగా లోధా కమిటీ నియమాలతో గంగూలీ వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకే పదవిలో కొనసాగనున్నాడు. ఈ సమయంలో ప్రతికూలంగా మారిన లోథా కమిటీ నియమాలను కొన్నింటిని ఎత్తివేసే సాహసం చేస్తే గంగూలీ కేవలం 10నెలల తరువాతే అధ్యక్షుడిగా తప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మరి చూడాలి పాలనలో కూడా దాదా గిరి చేసి తిరిగి బోర్డు ను మళ్ళీ గాడిలోకి తీసుకువచ్చి గంగూలీ శభాష్ అనిపించుకుంటాడో లేదో..