ఆసీస్తో జరిగిన టీ—20లో లంక బౌలర్ రజిత ఓ రికార్డును బ్రేక్ చేశాడు. క్రికెట్లో రికార్డులు బ్రేక్ అవ్వడం కామనే. ఆధునిక క్రికెటర్లు తమ బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాలతో ఎన్నో రికార్డులను అవలీలగా బ్రేక్ చేస్తారు. ఇందులో ఏముంది అనుకుంటే పొరపాటే.. రజిత బ్రేక్ చేసింది మంచి రికార్డ్ కాదు.. తన కెరీర్లోనే అత్యంత చెత్త ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతర్జాతీయ టీ 20ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా చెత్త రికార్డు సృష్టించాడు శ్రీలంక యువ ఫాస్ట్ బౌలర్ కసున్ రజిత. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్ లో రజిత నాలుగు ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 75 పరుగులు ఇచ్చి ఈ రికార్డు సృష్టించాడు. మ్యాచ్లో మొదట టాస్ గెలిచి ఫిల్డింగ్ తీసుకున్న శ్రీలంకకు ఆసీస్ ఓపెనర్లు ఆరోన్ ఫించ్ ,డేవిడ్ వార్నర్ చుక్కలు చూపెట్టారు. వీరిద్దరూ బౌండరీలతో చెలరేగడంతో 9 ఓవర్లలోనే ఆ జట్టు స్కోరు 100 పరుగులు దాటింది.
ఈ జోడి తరువాత వచ్చిన మాక్స్వెల్ చిన్నపాటి విధ్వసంమే సృష్టించాడు. కేవలం 28 బంతుల్లోనే 62 పరుగులతో చెలరేగిపోయాడు. మరో ఎండ్లో వార్నర్ కూడా దూకుడుగా ఆడి కెరీర్ లో మొదటి సెంచరీ పూర్తి చేశాడు. ఇలా ఆసీస్ బ్యాట్స్మెన్ రెచ్చిపోవడంతో రజిత బౌలింగ్ ఫిగర్స్ గల్లంతయ్యాయి. దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా మారాడు కసున్ రజిత. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 99 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆసీస్ బౌలర్ల ధాటికి లంక బ్యాట్స్మెన్ క్రీజులో నిలవలేకపోయారు.