భారత్,
బంగ్లాదేశ్ మధ్య ఆసక్తికరంగా జరుగుతున్న టీ - 20 సిరీస్ ఆదివారంతో తెరపడనుంది. మూడు టీ - 20 ల సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్లు ముగియగా తొలి టీ - 20 లో
బంగ్లాదేశ్, రెండో టీ - 20 లో
భారత్ జట్టు విజయాన్ని సాధించింది. దీనితో ఈరోజు నాగపూర్ వేదికగా రాత్రి 7 గంటలకి జరగబోతున్న ఆఖరి టీ -20 పై ఉత్కంఠ ఏర్పడింది. ఇప్పటి వరకూ టీమిండియా పై ఒక్కసారి కూడా
బంగ్లాదేశ్ టీ - 20 సిరీస్ గెలవలేదు.
టీ - 20 రికార్డుల పరంగా చూసుకుంటే బంగ్లాదేశ్ పై భారత్ దే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకూ పది మ్యాచ్ ల్లో ఈ రెండు జట్లూ తలపడగా
భారత్ జట్టు ఏకంగా 9 మ్యాచ్ ల్లో విజయాల్ని నమోదు చేసింది. ఇక మిగిలిన ఒక మ్యాచ్లో
బంగ్లాదేశ్ గెలవగా అది కూడా గత ఆదివారం (నవంబరు 3)
ఢిల్లీ వేదికగానే జరిగిన మ్యాచ్ కావడం విశేషం. నాగపూర్ పిచ్ స్పిన్నర్లకి అనుకూలించనుందనే వార్తలు వస్తుండగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టే ఆ స్టేడియంలో ఎక్కువగా విజయాల్ని అందుకున్నట్లు రికార్డులు చూపుతున్నాయి.
భారత్ జట్టులో ఓపెనర్, కెప్టెన్
రోహిత్ శర్మ సూపర్ ఫామ్ లో ఉండగా మరో ఓపెనర్
శిఖర్ ధావన్ ఇంకా తడబడుతూనే ఉన్నాడు. ఇంకా
రిషబ్ పంత్, కేఎల్
రాహుల్ కూడా సిరీస్లో గెలిపించే ప్రదర్శన ఒక్కటీ నమోదు కాలేదు. బౌలింగ్ లో చాహల్,
దీపక్ చాహర్ మాత్రమే నిలకడగా రానిస్తున్నారు. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ఖలీల్
అహ్మద్ గత రెండు టీ - 20 ల్లోనూ ధారాళంగా పరుగులిచ్చేసిన నేపథ్యంలో అతనిపై వేటు వేసి శార్ధూల్ ఠాకూర్ ని తుది జట్టులోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఆల్ రౌండర్ శివమ్ దూబే కూడా ఆశించిన స్థాయిలో రాణించక పోవడం విశేషం. దీనితో అతని స్థానంలో సంజు శాంసన్ టీమ్ లోకి రావొచ్చు.