భారత్ గడ్డపై తొలిసారి
టీ20 సిరీస్ గెలవాలని ఉవ్విళ్లూరిన బంగ్లాదేశ్ జట్టుకి భంగపాటు తప్పలేదు. నాగపూర్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన సిరీస్
విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ - 20 మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో సత్తాచాటిన టీమిండియా 30 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ని చిత్తు చేసింది. భారత ఫాస్ట్ బౌలర్
దీపక్ చాహర్ 6/7 తో టీ - 20 చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాల్ని నమోదు చేశాడు. దీంతో మూడు టీ - 20 ల సిరీస్ని 2-1తో
భారత్ చేజిక్కించుకోగా గురువారం నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.
మ్యాచ్లో తొలుత
శ్రేయాస్ అయ్యర్ (62: 33 బంతుల్లో 3x4, 5x6), కేఎల్
రాహుల్ (52: 35 బంతుల్లో 7x4) హాఫ్ సెంచరీలు బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగలిగింది. అనంతరం ఛేదనలో ఓపెనర్ మహ్మద్ నయిమ్ (81: 48 బంతుల్లో 10x4, 2x6) నిలకడగా ఆడటంతో
బంగ్లాదేశ్ గట్టి పోటీనే ఇచ్చింది. కానీ టీమ్ లో అతనికి ఎవరూ సహకారం అందించలేదు. దీనితో ఆ జట్టు ఆఖరికి 19.2 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో
దీపక్ చాహర్ కెరీర్ బెస్ట్ ప్రదర్శనని నమోదు చేయగా
యువ ఆల్రౌండర్ శివమ్ దూబే (3/30) కీలక సమయంలో వికెట్లు పడగొట్టి మ్యాచ్ ని భారత్ వైపు మళ్లించాడు.
వాస్తవానికి లక్ష్యాన్ని 12/2 తో పేలవంగా ఆరంభించిన
బంగ్లాదేశ్ తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ ఆ పరిస్థితులలో మహ్మద్ నయిమ్ అద్భుతంగా పోరాడాడు. కానీ
సౌమ్య సర్కార్ (0),
ముష్ఫికర్ రహీమ్ (0), ఆపిప్ హుస్సేన్ (0) లను గోల్డెన్ డక్ రూపంలో ఔట్ చేసేసిన టీమిండియా బంగ్లాదేశ్ని ఒత్తిడిలోకి నెట్టడంలో విజయం సాధించింది. మధ్యలో కెప్టెన్ మహ్మదుల్లా (8) కాస్త బ్యాట్ ఝళిపించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.
మ్యాచ్ లో టాస్ గెలిచిన
బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా భారత్ ని బ్యాటింగ్ కి పంపించాడు. దీనితో
శిఖర్ ధావన్ (19: 16 బంతుల్లో 4x4) తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన కెప్టెన్
రోహిత్ శర్మ (2: 6 బంతుల్లో) ఇన్నింగ్స్ రెండో ఓవర్ లోనే అవుట్ అవ్వగా కొద్దిసేపు బ్యాట్ ఝళిపించిన ధావన్ కూడా జట్టు స్కోరు 35 వద్ద పెవిలియన్ చేరిపోయాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ తో కలిసి కేఎల్
రాహుల్ బాధ్యతాయుత మ్యాచ్ ఆడాడు.
బంగ్లాదేశ్ బౌలర్లని ఉతికారేసిన ఈ జోడీ మూడో వికెట్ కి ఏకంగా 59 పరుగుల ముఖ్యమైన భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలో అర్ధ శతకం పూర్తి చేసుకున్న
రాహుల్ ఆ వెంటనే ఔటైనా
శ్రేయాస్ అయ్యర్ మాత్రం దూకుడు అస్సలు తగ్గించలేదు. ఇన్నింగ్స్ 15 వ ఓవర్ వేసిన స్పిన్నర్ ఆపిప్ హుస్సేన్ బౌలింగ్లో వరుసగా మూడు సిక్స్ లు బాదేసిన శ్రేయాస్ టీ - 20 కెరీర్లో ఫస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 144 వద్ద శ్రేయాస్ అవుట్ కాగా ఆఖర్లో శివమ్ దూబే (9 నాటౌట్: 8 బంతుల్లో) తో కలిసి మనీశ్ పాండే జట్టుకి మెరుగైన స్కోరుని అందించారు.