ఈడెన్ గార్డెన్స్‌లో పింక్ బాల్ టెస్ట్ అట్టహాసంగా ప్రారంభమైంది. క్రీడాభిమానులతో స్టేడియం కిక్కిరిసి పోయింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మ్యాచ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పింక్ బాల్ మ్యాచ్ కావడంతో.. ఈడెన్ గార్డెన్స్ అభిమానులతో నిండిపోయింది.

 

భారత్‌, బంగ్లా చారిత్రక  గులాబీ  టెస్టు ఆరంభమైంది. తొలిసారి ఈ రెండు జట్లు డే/నైట్‌ టెస్టు ఆడుతుండటంతో కోల్‌కతాలో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా  నగరం గులాబీ రంగు పులుముకుంది. బెంగాల్‌ క్రికెట్‌ సంఘం కార్యాలయం, హుగ్లీ నదిపై వంతెన, క్లాక్‌ టవర్‌, తదితర చారిత్రక ప్రదేశాల్లో ప్రత్యేకంగా అలంకరణలు చేశారు. అక్కడ గులాబి రంగులు విరజిమ్ముతున్నాయి. 

 

ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథులుగా బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, పశ్చిమ్‌ బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యారు. రెండు దేశాల జాతీయ గీతాలాపన ముగిశాక అతిథులిద్దరూ కలిసి ఈడెన్‌లో గంట మోగించి మ్యాచ్‌ను ప్రారంభించారు. టాస్‌ కోసం ప్రత్యేకంగా బంగారు నాణెం తయారుచేశారు.

 

అంతకు ముందు హసీనా, మమత బెనర్జీకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, బోర్డు పాలకులు, సచిన్‌ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. మైదానంలో అప్పటికే వరుసగా నిలబడ్డ క్రికెటర్ల వద్దకు వారిని తీసుకొచ్చారు. గంగూలీ స్వయంగా సారథి విరాట్‌ కోహ్లీని హసీనాకు పరిచయం చేశారు. ఆ తర్వాత పేరుపేరునా జట్టు సభ్యులు, కోచ్‌, సహాయ కోచ్‌లను కోహ్లీ ఆమెకు పరిచయం చేశారు. ఆమె తర్వాత మమతా బెనర్జీ, సచిన్‌ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. పింక్ బాల్ మహిమతో ఈడెన్‌ గార్డెన్‌ దాదాపు నిండిపోయింది. అన్ని టికెట్లు విక్రయించడంతో స్టాండ్లన్నీ కళగా కనిపిస్తున్నాయి. పింక్‌ టెస్ట్‌ సందర్భంగా కోల్‌కతాలోని కొన్ని దుకాణాల్లో మిఠాయిలను గులాబీ రంగులో తయారు చేశారు. ఈ చిత్రాలను సౌరవ్‌ గంగూలీ ట్విటర్లో పంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: