ఆస్ట్రేలియా టూర్ లో ఇటీవల టీ - 20 సిరీస్‌ ని చేజార్చుకున్న పాకిస్థాన్‌ టీం టెస్టు సిరీస్‌ ని కూడా పేలవ ఓటమితో ఆరంభించింది. బ్రిస్బేన్ వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌ లో పాకిస్థాన్‌ పై ఇన్నింగ్స్, 5 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా అలవోకగా విజయం సాధించింది. ఇక సిరీస్‌ లో మిగిలిన రెండో టెస్టు మ్యాచ్‌ శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా మొదలు కానుంది.

 

గురువారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ టీమ్ మొదటి ఇన్నింగ్స్‌ లో 240 పరుగులకి ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు, డేవిడ్ వార్నర్ (154: 296 బంతుల్లో 10x4), మార్నస్ లబుషేన్ (185: 279 బంతుల్లో 20x4) భారీ సెంచరీలు బాదడంతో 580 పరుగులు చేసింది.

 

ఆ తర్వాత 340 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టులో బాబర్ అజామ్ (104: 173 బంతుల్లో 13x4), మహ్మద్ రిజ్వాన్ (95: 145 బంతుల్లో 10x4) గట్టిగా పోరాడారు. కానీ, కెప్టెన్ అజహర్ అలీ (5), హారీస్ సోహైల్ (8), అసద్ (0), ఇప్తార్ అహ్మద్ (0) తక్కువ స్కోరుకే ఔటవడం ఆ జట్టుని భారీ దెబ్బ తీసింది. దీనితో 84.2 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 335 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. మ్యాచ్‌ లో భారీ శతకం బాదిన లబుషేన్‌ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

 

ఈ ఏడాది ఆగస్టు నుంచి ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ మొదలవగా అప్పటి నుంచి కనీసం ఒక్క టెస్టు కూడా ఆడని పాకిస్థాన్ జట్టు తాజాగా ఆడిన మొదటి టెస్టు లోనే ఓడిపోయింది. మరోవైపు భారత్ జట్టు ఆడిన అన్ని మ్యాచ్‌లోనూ గెలిచి ఛాంపియన్‌షిప్ పట్టికలో మొదటి స్థానంలో దూసుకెళ్తున్న విషయం అందరికి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: