టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్పై జరిగినంత చర్చ.. ఈ ఏడాది భారత క్రికెట్లో మరి దేని గురించీ జరగలేదేమో..? అయితే ధోని ఫ్యాన్స్కు ఇప్పుడు గుడ్ న్యూస్. మిస్టర్ కూల్ మరో రెండేళ్లు పాటు ఐపీఎల్లో కొనసాగనున్నాడు. అదే విధంగా తన రిటైర్పై జనవరి వరకు ప్రశ్నలు అడొగొద్దని ఫ్యాన్స్ని కోరాడు జార్ఖండ్ డైనమైట్.
ఇంగ్లండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా ఊహించారు. కానీ.. టోర్నీ ముగిసి మూడు నెలలు గడుస్తున్నా.. ఈ మాజీ కెప్టెన్ మాత్రం వీడ్కోలుపై పెదవి విప్పడం లేదు. మరోవైపు భారత సెలక్టర్లు.. ధోనీని పక్కనపెట్టి వరుసగా రిషబ్ పంత్, సంజు శాంసన్లకి టీ20ల్లో కీపర్లుగా అవకాశమిస్తున్నారు. దీంతో.. ధోనీ కెరీర్ ఇక ముగిసిపోయిందని అందరూ భావించారు. కానీ తన రిటైర్మెంట్ పై ధోని స్పష్టత ఇచ్చాడు. ఓ వాణిజ్య ప్రకటన ఆవిష్కరణలో రిటైర్ రచ్చపై క్లారిటీ ఇచ్చాడు మహేంద్రుడు. వచ్చే జనవరి వరకు రిటైర్మైంట్పై తనను ప్రశ్నలు అడగొద్దని ఫ్యాన్స్ను కోరాడు మిస్టర్కూల్. అదే విధంగా ధోని వరల్డ్కప్ మోమరీస్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.
మరోవైపు చెన్నై సూపర్కింగ్స్ ప్రాంచైజీ ధోని మరో రెండేళ్లు ఐపీఎల్ ఆడతాడని తెలిపింది. అలాగే బీసీసీఐ అధికారులు సైతం ధోని రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం ఫైనల్ టీమ్ ఎంపికలో ధోనీని కూడా పరిగణనలోకి తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. అప్పటి వరకు జాతీయ క్రికెట్లో అతడు కొనసాగుతాడని రిటైర్ వార్తలకు తెరదించారు.
మొత్తానికి.. నెట్టింట్లో ధోనీ రిటైర్మెంట్పై చర్చ మరోసారి పతాక స్థాయికి చేరింది. ప్రస్తుతం ధోనీ నుంచే కొంత స్పష్టత రావడంతో జనవరి వరకు ఊహాగానాలకు తెరపడినట్టే అని భావిస్తున్నారు క్రికెట్ క్రిటిక్స్.