పీవీ సింధు... ఈ పేరు తెలియని భారతీయ క్రీడాభిమానులుండరు. ఎందుకంటే ఆమె సాధించిన రికార్డులు అలాంటివి. కానీ కొంతకాలంగా తన ఫామ్ ని కొనసాగించడంలో కాస్త విఫలమైతుంది. రీసెంట్గా బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి వచ్చిన భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు విజయంతో టోర్నీని ముగిచింది. చైనాలో నేడు జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో సింధు 21-19, 21-19 తో చైనా దేశానికి చెందిన హే బింగ్జియావోపై విజయం సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
గ్రూప్- ఏ లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ ను భారత స్టార్ పీవీ సింధు కేవలం 42 నిమిషాల్లోనే ముగించింది. ఇప్పటికే తను ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన సింధు, టోర్నీ నాకౌట్ దశ నుంచి తప్పుకున్న సంగతి విదితమే.
మ్యాచ్ తొలి గేమ్ లో చైనా ప్లేయర్ ఆట మొదట్లో 7-3 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ దశలో సింధు కాస్త పుంజుకున్నప్పటికీ విరామదశకు బింగ్ 11-6తో ఆధిక్యానికి వెళ్లిపోయింది. అయితే బ్రేక్ తర్వాత వ్యూహం మార్చిన సింధు కచ్చితమైన బేస్ లైన్ ఆటతోపాటు మెరుగైన స్మాష్లతో ప్రత్యర్థిని ఆడడానికి అసలు అవకాశం ఇవ్వలేదు.
దీనితో 18-18 తో స్కోరు సమం చేసి అదే జోరులో గేమ్ను కూడా దక్కించుకుంది. ఇంక రెండో గేమ్ లో పుంజుకున్న సింధు 11-8 తో బ్రేక్కు వెళ్లింది. అనంతరం వరుసగా పాయింట్లు సాధించి 18-13 తో తిరుగులేని ఆధిక్యాన్ని పొందింది. అదే జోరులో గేమ్ తోపాటు మ్యాచ్ను కూడా కైవసం చేసుకుంది.
అంతకముందు ఈ టోర్నీలో అకానే యమగూచి (జపాన్), చెన్ యూఫీ (చైనా) చేతిలో ఓడిపోయింది పీవీ సింధు. మరోవైపు గత ఐదు సార్లల్లో బింగ్ జియావోపై సింధుకిదే తొలి విజయం కావడం విశేషం. మరోవైపు మహిళల విభాగంలో యమగూచి, యూఫీ, నొజోమి ఒకుహారా (జపాన్), తైజు యింగ్ (చైనీస్ తైపీ) సెమీస్కు చేరారు. పురుషుల విభాగం నుంచి కెంటో మొమోటా (జపాన్), చెన్ లాంగ్ (చైనా), అంటోనీ గింటింగ్ సిన్సుకా (ఇండోనేసియా), జూ వీ వాంగ్ (తైవాన్) సెమీస్కు అర్హత సాధించారు.