వెస్టిండీస్ తో జరిగిన టి 20 సిరీస్ గెల్చుకున్న ఆనందం తో ఉన్న టీమిండియా కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది . టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆదివారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ దూరమయ్యాడు . ఇప్పటికే ఫేస్ బౌలర్లు బుమ్రా , నవదీప్ సైనీ లు గాయపడడం, ఇప్పడు భువీ గాయం తిరగబెట్టడం తో భారత్ ఫేస్ బౌలింగ్ విభాగం బలహీనపడింది . వన్డే ప్రపంచ కప్ టోర్నీ అనంతరం మోకాలిగాయం కారణంగా ఆటకు నాలుగు నెలలపాటు దూరమైన భువనేశ్వర్ కుమార్ , వెస్టిండీస్ తో జరిగిన టి 20 సిరీస్ సందర్బంగా జట్టు లో చేరాడు .
వన్డే సిరీస్ కోసం భారత్ జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా భువీ గాయం తిరగబెట్టినట్లు తెలుస్తోంది . ఈ విషయాన్ని జట్టు మేనేజ్ మెంట్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ , భువీ స్థానం లో జట్టులోకి ముంబయి పేసర్ ఠాకూర్ ను తీసుకోనున్నట్లు సమాచారం . ఇక భువీ గాయం గురించి కోచ్ భరత్ అరుణ్ స్పందిస్తూ ఫిజియో పరీక్షలు నిర్వహిస్తున్నాడని నివేదిక రాగానే గాయం పై ఒక స్పష్టత వస్తుందని చెప్పాడు . భువీ స్థానం లో ఉమేష్ యాదవ్ ను ఎంపిక చేస్తారని భావించినప్పటికీ , ఠాకూర్ వైపు సెలెక్టర్లు మొగ్గు చూపారు .
సైనీ గాయం నుంచి కోలుకున్నప్పటికీ , పూర్తి స్థాయి ఫిట్ నెస్ సాధించని కారణంగా జట్టులోకి తీసుకోలేదు . రిస్క్ చేయడం ఎందుకని సైనీ ని జట్టులోకి తీసుకోకుండా ఠాకూర్ ను వన్డే జట్టుకు ఎంపిక చేసి ఉంటారని క్రీడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . ఇక ఠాకూర్ గత ఏడాది ఆసియా కప్ లో పాల్గొన్న భారత్ జట్టు తరుపున ఆశించిన స్థాయి లో ఆకట్టుకోలేకపోయాడు .