వెస్టిండీస్ తో చెన్నై లో జరిగినబి తొలి వన్డే లో భారత్ జట్టు మేనేజ్ మెంట్ ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగాలని నిర్ణయించడాన్ని మాజీ ఆటగాళ్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు . పేలవమైన బౌలింగ్ కారణంగానే భారత్ జట్టు ఓటమి పాలయిందని , దానికి జట్టు మేనేజ్ మెంట్ బాధ్యత వహించాలని మాజీలు విమర్శిస్తున్నారు . బౌలింగ్ లైనప్ ను జట్టు మేనేజ్ మెంట్ ఎందుకు బలహీన పరుస్తుందో అర్ధం కావడం లేదని మాజీలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు .
గతం లో ఎన్నో మ్యాచ్ లు బౌలర్లే గెలిపించిన విషయాన్ని గుర్తు చేస్తూ , చివరి స్థానాల్లో బ్యాటింగ్ చేసేందుకు స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్లు అవసరం లేదని అన్నారు. రెండవ వన్డే లో జట్టు విజయం సాధించాలంటే బౌలింగ్ లైనప్ బలోపేతం చేయాలని మాజీలు సూచించారు . తొలి వన్డే లో భారత్ జట్టు మహ్మద్ షమీ , దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్ , రవీంద్ర జడేజా లతో పాటు పార్ట్ టైం బౌలర్ శివమ్ దూబే , ఖేదార్ జాదవ్ లపై జట్టు మేనేజ్ మెంట్ ఆధారపడింది . శివమ్ దూబే , రవీంద్ర జడేజా లు ధారాళంగా పరుగులు ఇవ్వవగా , షమీ , చాహర్ లు కూడా వెస్టిండీస్ బ్యాట్స్ మెన్లను కట్టడి చేయడం లో విఫలమయ్యారు .
చాహర్ పొదుపుగా పరుగులిచ్చి , విండీస్ ఓపెనర్ వికెట్ దక్కించుకున్నప్పటికీ , కీలక సమయం లో వికెట్లను పడగొట్టలేకపోయాడు . అనుభవజ్ఞుడైన షమీ కూడా తొలి వన్డే లో ఆకట్టుకోలేకపోయాడు . మ్యాచ్ ఫలితం దాదాపు ఖరారైన తరువాత వికెట్ తన ఖాతాలో వేసుకున్న , షమీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు . ఇక కుల్దీప్ పొదుపుగా బౌలింగ్ వేసినా వికెట్లు నేలకూల్చలేకపోయాడు .