కోహ్లీసేన బుధవారం వెస్టిండీస్‌తో  రెండో వన్డే  విశాఖ పట్నంలో ఆడే సంగతి తెలిసిందే. ఇప్పటికే చెన్నై లో జరిగిన మొదటి వన్డే లో గెలిచి వెస్టిండీస్‌ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. భారత్ ఈ వన్డేలో గెలిచి సిరీస్ ని సమం చేయాలని కసితో ఉంది. వెస్టిండీస్‌ బ్యాట్స్ మన్ ని కట్టడి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ఐఛ్చిక శిబిరంలో ఆటగాళ్లు సాధన చేశారు. 

 

అయితే భారత పేసర్ దీపక్ చాహర్  సీనియర్ జట్టులోకి తన ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో మెరుగ్గా ప్రదర్శన చేయడం ద్వారానే తాను టీమిండియాలోకి త్వరగా ఎంపికైనట్లు చాహర్ తెలిపాడు. లాంగ్ ఫార్మాట్ కంటే వైట్ బాల్ క్రికెట్ ద్వారానే టీమిండియాలోకి ఎంపికవ్వాలనుకునే తన కల నెరవేరిందని చాహర్ చెప్పుకొచ్చాడు. ఇటీవల బంగ్లాదే‌శ్‌తో జరిగిన టీ20లో ఏడు పరుగులకు ఆరు వికెట్లు తీయడం ద్వారా తను అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. 
 
ఆ మ్యాచ్‌లో అతను హ్యాట్రిక్ కూడా సాధించడంతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకుంది. నిజానికి ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సత్తాచాటి టీమిండియాలోకి ఎంపిక కావాలని తాను తొలుత భావించినట్లు తెలిపాడు. హైదరాబాద్‌పై రంజీల్లో అరంగేట్రం చేసిన చాహర్.. తొలి మ్యాచ్‌లోనే సంచలన ప్రదర్శన చేసి అందరి చూపును తన వైపుకు తిప్పుకున్నాడు. అయితే తాను కేవలం 125 కిమీ వేగంతో బౌలింగ్ చేస్తానని, లాంగర్ ఫార్మాట్లో ఈ వేగం పనికి రాదని గుర్తించినట్లు తెలిపాడు. 
 
ఈనేపథ్యంలో లిమిటెడ్ ఓవర్ల క్రికెట్‌పై దృష్టి పెట్టి సక్సెస్ అయినట్లు చాహర్ తెలిపాడు. ముఖ్యంగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున రాణించడం ద్వారా టీమిండియా తలుపులు తెరుచుకున్నాయని పేర్కొన్నాడు. ముఖ్యంగా చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎంతగానో ప్రొత్సహించాడని తెలిపాడు. ఐపీఎల్లో పవర్‌ప్లేలోనే మూడు ఓవర్లు వేసేవాణ్నని, ఈక్రమంలో తన బౌలింగ్‌ను బాగా మెరుగుపర్చుకున్నట్లు తెలిపాడు. మరోవైపు భారత టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యునిగా మారిన చాహర్.. వన్డే జట్టులోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: