విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఇండియా-వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం వన్డే క్రికెట్ మ్యాచ్ జరగనున్నది. దీనితో క్రికెట్ అభిమానులలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ ఏడీసీపీ ఎం.రమేష్ కుమార్ తెలిపారు. క్రికెట్ మ్యాచ్ మొదలైన తర్వాత జాతీయరహదారిలో అన్ని వాహనాలను అనుమతిస్తామని చెప్పారు. కోల్కతా, శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వైపు వెళ్లే అన్ని భారీ వాహనాలను ఆనందపురం వద్ద మళ్లించి పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఎలమంచిలి, పరవాడ, అనకాపల్లి, గాజువాక, వైజాగ్ పోర్టు వైపు నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే వాహనాలను ఎన్ఏడీ వద్ద దారిమళ్లించి గోపాలపట్నం, పెందుర్తి మీదుగా ఆనందపురం వైపు పంపుతారు.
నగరం నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే అన్ని వాహనాలను ఎండాడ వద్ద దారి మళ్లించి రుషికొండ మీదుగా బీచ్రోడ్డు, తిమ్మాపురం మీదుగా మారికవలస వద్ద తిరిగి జాతీయరహదారిపైకి చేరేలా చూస్తారు. ఎండాడ-కార్షెడ్ మధ్య జాతీయరహదారిపై పాసులు లేని కార్లు, క్రికెట్ టిక్కెట్టు లేనివారి వాహనాలను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ అనుమతించరు.
శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే వాహనాలను (క్రికెట్ మ్యాచ్కు వచ్చేవారు తప్ప) మారికవలస నుంచి జురాంగ్ జంక్షన్, తిమ్మాపురం, బీచ్రోడ్డు మీదుగా అప్పూఘర్, ఎంవీపీ డబుల్రోడ్డు వైపు మళ్లిస్తారు. గోపాలపట్నం, సింహాచలం నుంచి హనుమంతవాక వైపు వచ్చే అన్ని వాహనాలను పాత అడవివరం వద్ద శొంఠ్యాం, ఆనందపురం వైపు మళ్లిస్తారు.
వాహనాల పార్కింగ్ ఇలా...
వీవీఐపీ, వీఐపీ పాసుల కలిగినవారు కారు అద్దంపై వాటిని అతికించాలి. పోలీసుల అనుమతి లేదా పాస్లులేని వాహనాలను స్టేడియం వైపు అనుమతించరు. వీవీఐపీ వాహనాలను స్టేడియం మెయిన్ గేటు పక్క నుంచి వెళ్లి దక్షిణం వైపు స్థలంలో పార్కింగ్ చేయాలి. వీఐపీ వాహనాలను వారికి కేటాయించిన బీగ్రౌండ్ పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేయాలి.ప్రెస్, ఎలక్ర్టానిక్ మీడియా వాహనాలను పీఎంపాలెం ట్రాఫిక్ పోలీస్స్టేషన్ దగ్గర హెచ్బీకాలనీ లోపల వేంకటేశ్వర ఆలయం వద్ద నిర్దేశించిన స్థలంలో పార్కిగ్ చేసుకోవాలి. ప్రభుత్వ, పోలీస్ వాహనాలను క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న నారాయణ కాలేజీ వెనుక ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసుకోవాలి. పాస్లు లేని అన్నిరకాల వాహనాలను గేట్ నంబర్ రెండు నుంచి 13 వరకూ గల రోడ్డులో సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకుని అక్కడి మైదానంలో పార్కింగ్ చేయాలి. క్రికెట్ స్పెషల్ ఆర్టీసీ బస్సులు ఎంవీపీ డబుల్రోడ్డు, అప్పూఘర్, సాగర్నగర్, రుషికొండ, తిమ్మాపురం మీదుగా కాపులుప్పాడ, ఐటీ సెజ్ మీదుగా మిఽథిలాపురి వుడా 100 అడుగుల రోడ్డుకు చేరుకుని అక్కడ రోడ్డుపక్కన పార్కింగ్ చేసుకోవాలి.విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లాల్సిన క్రికెట్ స్పెషల్ బస్సులు పెప్సీ కంపెనీ రోడ్డులో పార్కింగ్ చేయాలి. మ్యాచ్ పూర్తైన తర్వాత ఐటీ సెజ్ మీదుగా మారికవలస చేరుకుని జాతీయరహదారిపైకి చేరాలి.
నగరంలోకి రావాల్సిన క్రికెట్ స్పెషల్ బస్సులు ఎన్వీపీ లాకాలేజీ రోడ్డులో పార్కు చేసి మ్యాచ్ ముగిసిన తర్వాత క్రీడాకారులు వెళ్లిపోయిన తర్వాత వెళ్లాలి. నగరం నుంచి ఆనందపురం వైపు వెళ్లే ఆటోలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహం రెండు వరకూ ఎండాడ వరకూ అనుమతిస్తారు. అక్కడ గీతం కాలేజీ రోడ్డులోకి తిరిగి బీచ్రోడ్డు మీదుగా తిమ్మాపురం, మారికవలస చేరుకోవాలి. పార్కింగ్ స్థలంలో కాకుండా ఇతర చోట్ల వాహనాలను నిలిపితే సెక్షన్ 283 ఐపీసీ, 122 ఎంవీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటారు.