వెస్టిండీస్‌ చేతిలో చెపాక్ వన్డే ఓటమికి టీమిండియా విశాఖలో విజయంతో బదులు తీర్చుకుంది. విశాఖపట్నం వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో ఓపెనర్లు రోహిత్ శర్మ (159: 138 బంతుల్లో 17x4, 5x6), కేఎల్ రాహుల్ (102: 104 బంతుల్లో 8x4, 3x6) సెంచరీలు బాదడంతో తొలుత 5 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్ జట్టు.. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కరీబియన్లని 280 పరుగులకే కుప్పకూల్చింది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (3/52) హ్యాట్రిక్ వికెట్లతో విండీస్ నడ్డి విరచగా.. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (3/39) కీలక సమయంలో వరుసగా రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ని భారత్‌వైపు తిప్పాడు. దీంతో.. 107 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ని 1-1తో సమం చేయగా.. విజేత నిర్ణయాత్మక ఆఖరి వన్డే మ్యాచ్ కటక్ వేదికగా ఆదివారం జరగనుంది. 

 
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ జోడీ తొలి వికెట్‌కి 37 ఓవర్లలో ఏకంగా 227 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ జట్టు తిరుగులేని స్థితికి చేరుకుంది. శతకం తర్వాత కేఎల్ రాహుల్ ఔటవగా.. ఆ తర్వాత వరుస సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ కూడా కాట్రెల్ బౌలింగ్‌లో  వెనుతిరిగాడు. రోహిత్ ఔట్ తర్వాత 44వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ తన పవర్ హిట్టింగ్‌తో స్కోరు బోర్డుని పరుగులెత్తించాడు. ఇన్నింగ్స్ 45వ ఓవర్ వేసిన అల్జారీ జోసఫ్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన రిషబ్ పంత్ (39: 16 బంతుల్లో 3x4, 4x6) .. ఆ తర్వాత ఓవర్ వేసిన కాట్రెల్ బౌలింగ్‌లో వరుసగా 6, 0, 4, 6, 4, 4 బాదేశాడు. రిషబ్ పంత్ జోరు చూసిన శ్రేయాస్ అయ్యర్ (53: 32 బంతుల్లో 3x4, 4x6) కూడా 47వ ఓవర్‌లో బ్యాట్ ఝళిపించేశాడు. స్పిన్నర్ రోస్టన్ ఛేజ్ వేసిన ఆ ఓవర్‌లో శ్రేయాస్ అయ్యర్ 6, 6, 4, 6, 6 బాదేశాడు. దీంతో.. రెండు ఓవర్ల వ్యవధిలోనే టీమిండియా ఏకంగా 55 పరుగుల్ని పిండుకుంది. కానీ.. ఆఖర్లో పంత్, శ్రేయాస్ ఔటవగా.. జాదవ్ ఆశించిన మేర హిట్టింగ్ చేయలేకపోయాడు. దీంతో.. 400 పరుగుల మార్క్‌ని అందుకునేలా కనిపించిన భారత్ 387 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

 

388 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్టిండీస్‌కి ఓపెనర్లు ఎవిన్ లావిస్ (30: 35 బంతుల్లో 5x4), షై హోప్ (78: 85 బంతుల్లో 7x4, 3x6) తొలి వికెట్‌కి 61 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభమిచ్చారు. మొదటి ఓవర్‌లోనే చాహర్ బౌలింగ్‌లో షైహోప్ క్యాచ్‌ని స్లిప్‌లో కేఎల్ రాహుల్ నేలపాలు చేశాడు. దీంతో.. నిరాశతోనే టీమిండియా బౌలింగ్ దాడి ప్రారంభమైంది. కానీ.. 11వ ఓవర్‌లో ఎవిన్ లూయిస్ ని  ఔట్ చేయడం ద్వారా శార్ధూల్ ఠాకూర్ భారత్‌కి బ్రేక్ ఇవ్వగా.. ఆ తర్వాత హిట్టర్ సిమ్రాన్ హిట్‌మెయర్ ని  శ్రేయాస్ అయ్యర్ - జడేజా జోడీ తెలివిగా రనౌట్ చేసింది. దీంతో.. ఒత్తిడికి గురైన విండీస్‌ టీమ్‌ని రోస్టన్ ఛేజ్ (4)ను ఔట్ చేయడం ద్వారా జడేజా మరింత ఆత్మరక్షణలోకి నెట్టాడు. కానీ.. ఒక ఎండ్‌లో క్రీజులో పాతుకుపోయిన షైహోప్ భారీ షాట్లు ఆడుతూ భారత్ బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగాడు. 

 
ఛేదనలో విండీస్ పుంజుకుంటున్న దశలో ఒక ఓవర్ వ్యవధిలో మహ్మద్ షమీ మ్యాచ్‌ని మళ్లీ భారత్‌ వైపు తిప్పేశాడు. షార్ట్ పిచ్ బంతితో నికోలస్ పూరన్ (75: 47 బంతుల్లో 6x4, 6x6)ని తొలుత బోల్తా కొట్టించిన షమీ.. ఆ తర్వాత బంతికే కెప్టెన్ కీరన్ పొలార్డ్‌ని కూడా గోల్డెన్ డక్‌గా పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తర్వాత రెండు ఓవర్ల వ్యవధిలోనే కుల్దీప్ యాదవ్ రంగంలోకి దిగి హ్యాట్రిక్ వికెట్లతో భారత్ గెలుపుని ఖాయం చేశాడు. ఫస్ట్ షైహోప్‌ని ఔట్ చేసిన కుల్దీప్ ఆ తర్వాత వరుసగా జేసన్ హోల్డర్ (11), అల్జారీ జోసఫ్ (0)లను బోల్తా కొట్టించి హాట్ ట్రిక్ సాధించాడు. ఆఖర్లో కీమో పాల్ (46: 42 బంతుల్లో 1x4, 1x6), పిర్రీ (21: 18 బంతుల్లో 3x4) బ్యాట్ ఝళిపించినా.. అప్పటికే విండీస్‌కి మ్యాచ్ చేజారిపోయింది. 43.3 ఓవర్లలోనే వెస్టిండీస్ ఆల్ అవుట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: