క్యాచ్లే మ్యాచ్లను గెలిపిస్తాయి. ఇది క్రికెట్లో ఒక నానుడి...చాలా సార్లు రుజువైంది కూడా...! కానీ టీమిండియా ఆటగాళ్లు ఈ విషయం మర్చిపోయినట్లున్నారు. ఈ మధ్య మనోళ్ల ఫీల్డింగ్ చూస్తుంటే...గల్లీ క్రికేట్ను తలపిస్తోంది.. అసలు అనుభవమే లేనట్లు... ఆడుతుంది తొలి మ్యాచ్ అన్నట్లు ఉంది వ్యవహారం. క్రికేట్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యం గురించే మాట్లాడుకుంటున్నారు.
క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్ కు ఎంత ప్రధాన్యం ఉంటుందో...ఫీల్డింగ్కు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ తోనే మ్యాచ్లు గెలవాలని చూస్తున్నారు. విండీస్ తో సిరీస్ లో మనోళ్ల పీల్డింగ్ చూస్తే ఇది నిజమే అనిపించకమానదు. ఈ సిరీస్ల్లో టీమిండియా మ్యాచ్ల్లో ఓడిదంటే అందుకు ప్రధాన కారణం ఫీల్డింగ్ వైఫల్యమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలా ఉంది మనోళ్ల ఫీల్డింగ్. అసలు ఓ గల్లీ క్రికెటర్ కూడా ఇంతలా చెత్త ఫీల్డింగ్ చేయడు. మనోళ్లు ఫీల్డింగ్ విన్యాసాలు చూస్తే.. వీళ్లు ఇంటర్నేషనల్ క్రికెటర్లా.. లేకపోతే గల్లీ క్రికెటర్ల అన్న అనుమానం ప్రతి క్రికెట్ అభిమానికి కలుగుతోంది ఇప్పుడు. ఇక టీ-20 సిరీస్ లో అయితే మనోళ్ల ఫీల్డింగ్ విన్యాసాలు చూస్తే.. ముక్కున వేలు వేసుకోవాల్సిందే. మనోళ్ల బ్యాటింగ్ కారణంగా పొట్టి సిరీస్ గెలిచాం.. కానీ లేకపోతే సొంతగడ్డపై భారీ పరాభవం తప్పి ఉండేది కాదు.
వెస్టిండీస్తో సిరీస్ మొదలైనప్పటి నుంచి భారత్ ఫీల్డింగ్ తప్పిదాలపై చర్చ జరుగుతూనే ఉంది. ప్రతి మ్యాచ్లోనూ ఫీల్డర్లు క్యాచ్ల్ని చేజార్చుతున్నారు. 289 పరుగుల ఛేజింగ్లోనూ విండీస్ టీమ్ని ముందుండి నడిపించిన సిమ్రాన్ హెట్మెయర్ ఇచ్చిన సులువైన క్యాచ్ని శ్రేయాస్ అయ్యర్ చేజార్చాడు. అప్పుడే సెంచరీ అందుకున్న హెట్మేయర్.. దీపక్ చాహర్ బౌలింగ్లో మిడ్ వికెట్ దిశగా సిక్స్ కోసం ప్రయత్నించాడు. కానీ.. అది బౌండరీ లైన్ వద్ద శ్రేయాస్ సులువుగా అందుకునేలా కనిపించాడు. అయితే.. తత్తరపాటులో అతను వదిలేయగా.. ఆ తర్వాత జడేజా బౌలింగ్లో వరుసగా సిక్సర్లు బాదిన హెట్మేయర్ విండీస్ని విజయతీరాలకు దగ్గర చేశాడు. ఒకవేళ అప్పుడు హిట్మెయర్ ఔటై ఉండింటే..? భారత క్రికెటర్లలో ఉత్సాహం పెరిగి కనీసం పోరాడేవారు.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదిపైనే ఈ సిరీస్లో క్యాచ్లు చేజారాయి. మనోళ్ల వీరు బాదుడు వల్ల ఫీల్డింగ్ తప్పిదాలు మరుగున పడిపోయాయి. చెపాక్ టీమిండియా పరాజయానికి చెత్త ఫీల్డింగ్ ప్రధాన కారణం. విండీస్ బ్యాట్స్మెన్ ఇచ్చిన క్యాచ్లను ఓకే ఓవర్లో నేలపాలు చేయడం టీమిండియాను గట్టిగా దెబ్బతీసింది. సుందర్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, పంత్, శ్రేయస్ అయ్యర్ ఇలా ప్రతి ఒక్కరూ క్యాచ్లు వదిలేసిన వారే. సులభమైన క్యాచ్లను కూడా నేలపాలు చేశారు. నిజాయితీగా చెప్పాలంటే విండీస్ బౌలర్లు చెత్త బౌలింగ్ వల్ల వైజాగ్ మ్యాచ్లో టీమిండియా గట్టెక్కింది. ఎంత భారీ స్కోరు చేసినా.. క్యాచ్లు మిస్ చేస్తే మ్యాచ్ గెలవడం కష్టమే. నిర్ణయాత్మక చివరి వన్డేలోనైనా.. టీమిండియా ఫీల్డింగ్లో తప్పులు సరిదిద్దుకోకుంటే సిరీస్పై ఆశలు వదులుకోవాల్సిందే.