ప్రతీ వేసవిలో వచ్చే ఐపీఎల్ పండగకి ఆటగాళ్ళ కోసం నిన్న కోల్ కతా వేదికగా ఐపీఎల్ వేలమ్ జరిగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ వేలానికి మునుపే ఫ్రాంఛైజీలు తమకి నచ్చని ఆటగాళ్లని ట్రేడింగ్ ద్వారా మార్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి తాము కావాలని అనుకున్న ఆటగాళ్ల కోసం వేలం జరిగింది. ఈ వేలంలో చాలా మంది కొత్త కుర్రాళ్ళకి అవకాశం వచ్చింది. టీ ట్వంటీ క్రికెట్ లో యువ ఆటగాళ్ళే ఎక్కువ రాణిస్తారు కాబట్టి అవకాశాలు కూడా వారినే వరించాయి.
అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో హైదరాబాదీ కుర్రాడికి స్థానమ్ దక్కింది. గత ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ కి చెందిన సిరాజ్ బెంగళూరు తరపున ఆడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మరో ఆటగాడికి ఐపీఎల్ ఆడే అవకాశం వచ్చింది. హైదరాబాద్ లోని రామ్ నగర్ గల్లీలో పెరిగిన బావనక సందీప్ ఈ సారి హైదరాబాద్ తరపున ఆడనున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో సన్రైజర్స్ ఫ్రాంచైజీ సందీప్ను బేస్ ప్రైజ్ కే అంటే ఇరవై లక్షలకే సొంతం చేసుకుంది.
దీంతో మనోడికి అదృష్టం బాగా కలిసొచ్చిందని అంటున్నారు. హైదరాబాద్ తరపున ఆడుతూ వీవీఎస్ లక్ష్మణ్, ముత్తయ్య మురళీధరన్ లాంటి దిగ్గజాల మార్గదర్శకత్వంలో, కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రోత్సాహంతో సందీప్ ప్రొఫెషనల్ కెరీర్ మరింత ఉజ్వలంగా మారనుంది. ప్రస్తుతం సందీప్ పంజాబ్లో రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. తమ ప్రాంతం కుర్రాడికి ఐపీఎల్లో అవకాశం దక్కడంతో రాంనగర్లోని వైఎస్సార్ పార్కు సమీపంలోని సందీప్ నివాసం స్థానికులు, అభిమానులతో కోలాహలంగా మారిపోయింది.
18 ఏళ్ళ వయసులో రంజీలో అరంగేట్రం చేసిన సందీప్ ఆడిన మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేశాడు. ఈ అవకాశం అతన్ని మరిన్ని శిఖరాలకి తీసుకెళ్లాలని త్వరలోనే అతడు టీమిండియా తరపున ఆడాలని కోరుకుందాం.