ఈ ఏడాది 20-ట్వంటీ వరల్డ్ కప్ లో పాల్గొననున్న భారత మహిళ క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 2020 టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఆస్ట్రేలియాలో జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు 15 మంది సభ్యులను బీసీసీఐ ఎంపిక చేసింది. భారత మహిళల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్గా, స్మృతి మందన్నా వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తారు. ఈ మేరకు 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. అయితే వరల్డ్ కప్ టీంలో రిచా ఘోష్ ఒక్కరే కొత్త ముఖం కావడం గమనార్హం.
రీచా ఇటీవల జరిగిన మహిళల ఛాలెంజర్ ట్రోఫీలో భాగంగా.. ఒకే మ్యాచ్లో 26 బంతుల్లో 36 పరుగులు చేసి నాలుగు బౌండరీలు మరియు ఒక సిక్సర్ సాధించింది. ఇక ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఆస్ట్రేలియాలో టీ20 మహిళా వరల్డ్ కప్ జరగనుంది. మొత్తం పది జట్లు.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, థాయ్లాండ్ పాల్గొంటాయి. 23 మ్యాచ్లు జరుగుతాయి. తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా - భారత్ మధ్య జరగనుంది.
అలాగే వరల్డ్ టీ20 టీంలో హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్) సహా స్మృతి మంధానా, అరుంధతి రెడ్డి, షఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్జ్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి, రిచా ఘోష్, తానియా భాటియా, పూనం యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, పూజా వస్త్రాకర్లకు చోటు దక్కింది. ఇక భారత్ జట్టు ఆడే మ్యాచ్ల వివరాలు చూస్తే.. ఫిబ్రవరి 21: ఆస్ట్రేలియాతో (సిడ్నీ)ఫిబ్రవరి 24: బంగ్లాందేశ్తో (పెర్త్), ఫిబ్రవరి 27: న్యూజిలాండ్తో (మెల్బోర్న్), ఫిబ్రవరి 29: శ్రీలంకతో (మెల్బోర్న్) భారత్ తలపడనుంది.