టీమిండియాతో పాటు అండర్ 19 టీమిండియా కుర్రాళ్లు కూడా సత్తా చూపుతున్నారు. ప్రపంచకప్ క్రికెట్ లో దుమ్ము రేపుతున్నారు. తాజాగా జపాన్తో జరుగుతున్న మ్యాచులో మన కుర్రాళ్లు అదరగొట్టేశారు. అసలే జపాన్ పసికూన. అందుకే.. ఆ టీమ్ ను కేవలం 22.5 ఓవర్లకే కథ ముగించారు. జపాన్ కేవలం 41 పరుగులకే ఆలౌట్ అయ్యంది.
అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో ఇది రెండో అత్యల్ప సంయుక్త స్కోరు. భారత బౌలర్ రవి బిష్ణోయి (8-3-5-4) ప్రతి ఓవర్లోనూ రెండు వికెట్లు తీసాడు. జపాన్ ను కోలుకోలేని దెబ్బ తీశాడు. కార్తీక్ త్యాగి (6-0-10-3) ఐదో ఓవర్లో వరుస బంతుల్లో ఓపెనర్లను పెవిలియన్ పంపించాడు. ఆకాశ్ సింగ్ (4.5-1-11-2) కూడా పర్లేదు. విద్యాధర్ పాటిల్ ఒక వికెట్ తీశాడు.
టీమ్ ఇండియా దెబ్బతో ఐదుగురు జపాన్ ఆటగాళ్లు డకౌట్ అయ్యారు. ముగ్గురు ఒక్క పరుగుకే పరిమితం అయ్యారు. ఈ మ్యాచ్ లో జపాన్ ఆటగాళ్ల టాప్ స్కోరెంతో తెలుసా.. 7 పరుగులు మాత్రమే. షు నొగుచి (7), కెంటో ఒటొ డుబెల్ (7), మాక్స్ క్లెమెంట్స్ (5) టాప్ స్కోరర్లు.
కెంటో, క్లెమెంట్స్ ఎనిమిదో వికెట్కు 13 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇన్నింగ్స్లో ఇదే అత్యధిక పరుగుల భాగస్వామ్యం. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్ 4.5 ఓవర్లలోనే విజయభేరి మోగించింది.