ఒకప్పుడు భారత క్రికెట్ జట్టులో ఓ వెలుగు వెలిగిన మాజీ పేసర్ అజిత్ అగార్కర్ జాతీయ సెలక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. గత శుక్రవారం దరఖాస్తులకు డెడ్ లైన్ కావడంతో అగార్కర్ చివరినిమిషంలో దరఖాస్తు చేసుకున్నాడు.దాంతో ఒక్కసారిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవి రేసులోకి వచ్చేశాడు. 

 

ఇప్పటి వరకు సెలక్టర్ల పదవికి అప్లై చేసుకున్న వారిలో అగార్కర్ బాగా గుర్తింపు పొందిన క్రికెటర్ కాబట్టి అతనికే ఛైర్మన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముంబై సీనియర్ సెలక్షన్ కమిటీకి ఛైర్మన్ గా పనిచేసిన అగార్కర్ తాను సెలక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ధృవీకరించాడు. 

 

భారత్ తరఫున 26టెస్టులు, 191 వన్డేలు, మూడు టీ20లు ఆడిన అనుభవం అగార్కర్ ది. అన్ని ఫార్మాట్ లలో కలిపి 349 వికెట్లను అగార్కర్ ఖాతాలో వేసుకున్నాడు. వన్డేలో 288 వికెట్లు సాధించి ఈ ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు సాధించిన మూడో భారత బౌలర్ గా కొనసాగుతున్నాడు. అగార్కర్ ఆడుతున్న సమయంలో వేగవంతంగా 50వన్డే వికెట్లను సాధించిన ఘనతను నమోదు చేశాడు. 23 మ్యాచ్ ల్లోనే 50 వన్డే వికెట్లు సాధించాడు. ఆపై అగార్కర్ రికార్డును శ్రీలంక బౌలర్ మెండిస్ బ్రేక్ చేశాడు.

 

ప్రస్తుత కమిటీలో పదవీకాలం పూర్తి చేసుకున్న సెలక్టర్లు ఎమ్మెస్కేప్రసాద్, సెలక్టర్ గగన్ ఖోడా స్థానాలను బీసీసీఐ భర్తీ చేయనుండగా సందీప్ సింగ్, జతిన్ పరాంజపే, దేవాంగ్ గాంధీ మరో ఏడాది కొనసాగనున్న సంగతి తెలిసిందే. 


సెలక్టర్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అజిత్ అగార్కర్, చేతన్ శర్మ, నయాన్ మోంగియా, లక్ష్మణ్, శివరామకృష్ణన్, రాజేష్ చౌహాన్, అమే ఖురేషియా, గ్యానేంద్ర పాండే లాంటి ప్రముఖులున్నారు. మొత్తానికి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవి కోసం మహామహులే క్యూకట్టారు. దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి. మరి ఆ ఛైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ క్రీడాభిమానుల్లో నెలకొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: