న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ భారత్ సొంతమైంది. ఇంకా రెండు మ్యాచ్లు ఉండగానే సిరీస్ను టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. సెడాన్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20లో సూపర్ ఓవర్లో కోహ్లీసేనను విజయం వరించింది. ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టిన ఈ మ్యాచ్లో భారత జట్టు విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 179పరుగులు చేసింది.
భారత బ్యాట్స్మెన్లో రోహిత్(65), కోహ్లీ(38), రాహుల్(27) పరుగులు చేయగా.. అయ్యర్(17), మనీష్ పాండే(14) పర్వాలేదనిపించారు. శివందూబే(3) మాత్రమే నిరాశపరిచాడు. 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగులే చేయగలిగింది. ఇరు జట్ల స్కోర్ సమం కావడంతో సూపర్ ఓవర్కు వెళ్లారు. భారత బౌలర్లలో ఠాకూర్, షమి రెండేసి వికెట్లు తీసుకోగా.. చాహల్, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు.
సూపర్ ఓవర్లో న్యూజిలాండ్ తరఫున కెప్టెన్ కేన్ విలియమ్సన్, మార్టిన్ గప్తిల్ బ్యాటింగ్కు దిగారు. వీరిద్దరూ కలిసి రెండు ఫోర్లు, ఓ సిక్సర్తో 17పరుగులు చేశారు. దీంతో 18పరుగుల లక్ష్యంతో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బరిలోకి దిగారు. తొలి రెండు బంతుల్లో మూడు పరుగులే రావడంతో భారత్ విజయంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
అయితే తర్వాతి బంతికే రాహుల్ ఫోర్ కొట్టాడు. ఆ మరుసటి బంతికి సింగిల్ తీయడంతో రోహిత్ స్ట్రయికింగ్కు వచ్చాడు. తాను ఎదుర్కొన్న రెండు బంతులనూ సిక్సర్లుగా మలిచిన రోహిత్ జట్టుకు విజయాన్నందించాడు. దీంతో 5 మ్యాచుల టీ20 సిరీస్ను భారత్ 3-0తో మరో రెండు మ్యాచులు మిగిలుండగానే కైవసం చేసుకుంది.