తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు హైడ్రామా ను తలపిస్తున్నాయి . క్రీడాసంఘాలన్నీ కలిసి ఎన్నుకునే ఒలింపిక్ కమిటీ ఎన్నికలు , సాధారణ ఎన్నికల మాదిరిగానే తీవ్ర వివాదాలు చోటు చేసుకోవడం హాట్ టాఫిక్ గా మారింది . క్రీడాసంఘాల్లో రాజకీయ నేతల జోక్యాన్ని సహించేది లేదని ఒకవైపు క్రీడామంత్రిత్వ శాఖ ఎన్ని హెచ్చరికలు చేసిన ఫలితం మాత్రం కన్పించడం లేదు . దానికి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ గా పేర్కొనవచ్చు . ఒలింపిక్ ఎన్నికలు కాస్త అధికార టీఆరెస్ , బీజేపీ అన్నట్లుగా పరిస్థితి తయారయింది . దీనితో రెండు వర్గాలు ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కోర్టును కూడా ఆశ్రయించాయి .
ఒలింపిక్ ఎన్నికల్లో తొలుత ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు . అయితే ఆయన కు ఓటు హక్కును ఎన్నికల అధికారి తొలగించడం , తొలుత ఆయన ప్రత్యర్థి వర్గం నుంచి అధ్యక్ష పదవి కోసం పోటీ చేయాలనుకున్న రంగారావు స్థానం లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పోటీకి దిగడం ..వంటి పరిణామాలు పరిశీలిస్తే క్రీడాసంఘాల ఎన్నికల్లో ఎంతగా రాజకీయాలు పెనవేసుకున్నాయి స్పష్టం అవుతుంది . తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలను తొలుత ఢిల్లీ లో నిర్వహించాలని నిర్ణయించగా , ఈ విషయమై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రావు వర్గం హైకోర్టును ఆశ్రయించింది .
ఎన్నికలను హైదరాబాద్ లోనే పారదర్శకంగా నిర్వహించే విధంగా ఆదేశాలు జారీచేయాలని కోరింది . జగన్మోహన్ రావు వర్గం దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు , తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే , హైదరాబాద్ లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది .