న్యూజిలాండ్ తో వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు లో టీమిండియా నయా వాల్ పుజారా, కివీస్ బౌలర్లకు చిరాకు తెప్పించాడు. రెండో ఇన్నింగ్స్ లో భాగంగా 81బంతులను ఎదుర్కొన్న పుజారా 11 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క బౌండరీ కూడా లేదు అతని స్ట్రైక్ రేట్ 13.58.. అయితే క్రీజ్ లో పాతుకుపోయిన పుజారాను బౌల్ట్ బోల్తా కొట్టించాడు.
అప్పటి వరకు అద్భుతంగా పోరాడిన పుజారా 32ఓవర్ లో బౌల్ట్ విసిరిన చివరి బంతిని అంచనా వేయడం లో విఫలంకావడంతో బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు కోల్పోయి 114పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే ఇంకా 69 పరుగులు చేయాలి. రహానే(9*), హనుమ విహారి(1*) క్రీజ్ లో వున్నారు.
ఇక అంతకుముందు 216/5 ఓవర్ నైట్ స్కోర్ తో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన కివీస్.. మొదటి ఇన్నింగ్స్ లో 348పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. ఆల్ రౌండర్ గ్రాండ్ హోమ్ (43)పరుగులతో రాణించగా టైలండర్లు జమైసన్ (44),బౌల్ట్ (38) మెరుపులు మెరిపించడం తో న్యూజిలాండ్ ఆ స్కోర్ చేయగలింది. భారత బౌలర్ల లో ఇషాంత్ 5,అశ్విన్ 3వికెట్లు తీయగా షమి ,బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు.