భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ హద్దుమీరి ప్రవర్తించాడా? అంటే అవుననే కొంతమంది  నెటిజన్స్  ఫైర్ అవుతున్నారు . న్యూజిలాండ్ సిరీస్ లో తమస్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన కనబర్చలేక  టీమిండియా విమర్శల పాలవుతోన్న తరుణం లో , మైదానం కోహ్లీ చేసిన సైగలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి . న్యూజిలాండ్ ఆటగాడు జేమిసన్ 49  పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయినప్పుడు , కోహ్లీ నోటి మీద వేలు ఉంచి  ఆవేశంగా ఏదో అని సహచర ఆటగాళ్లతో కలిసి సంబరాలు చేసుకున్నాడు . ఇప్పుడు నెట్టింట్లో సదరు వీడియో వైరల్ గా మారింది .

 

కోహ్లీ ఆ సమయం లో అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు . అయితే కోహ్లీ ఏమన్నాడో స్పష్టంగా విన్పించనప్పుడు , అతడ్ని విమర్శించడం కరెక్టు కాదని మరికొంతమంది నెటిజన్లు అంటున్నారు .  కోహ్లీ పేలవ  బ్యాటింగ్ ఫామ్ భారత్ అభిమానులను కలవరపెడుతోంది . ఈ సిరీస్ లో ఇప్పటి వరకు భారత్ కెప్టెన్ ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే సాధించాడు . బ్యాటింగ్ లో పరుగుల వరద పారించే కోహ్లీ  బ్యాట్,  ఈ సిరీస్ లో మూగబోయినట్లయింది . సిరీస్ లో సజీవంగా నిలవాలంటే గెలవాల్సిన రెండవ టెస్టులోనూ కోహ్లీ ఆశించిన ప్రదర్శన కనబర్చలేకపోయాడు .

 

మొదటి ఇన్నింగ్స్ లో కేవలం మూడు పరుగుల వ్యక్తిగత స్కోర్ కే వెనుతిరిగిన కోహ్లీ , రెండవ ఇన్నింగ్స్ లో 14  పరుగులు సాధించి పెవిలియన్ దారిపట్టాడు . ఆటలో వైఫల్యం చాలదన్నట్టుగా పుండుమీద కారం చల్లినట్లుగా భారత్ సారథిని ఇప్పుడు వివాదాలు వెంటాడుతున్నాయి . బ్యాటింగ్ లో  దూకుడు ప్రదర్శించే  కోహ్లీ , మైదానం లోను అదే దూకుడును కొనసాగిస్తూ ఉంటాడు . కానీ బ్యాటింగ్ చేతులెత్తిసి , మైదానం లో ఇప్పుడు నోటికి పని చెప్పడం విమర్శలకు తావునిస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: