ఆస్ట్రేలియాలో నిన్న ముగిసిన ఉమెన్స్ టీ - 20 వరల్డ్ కప్ లో క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా ఒక జట్టుని ఐసీసీ విడుదల చేసింది. మొత్తం 12 మందితో కూడిన ఈ జట్టులో భారత్ నుంచి కేవలం ఇద్దరు అంటే ఇద్దరు క్రికెటర్లకి మాత్రమే సెలెక్ట్ చేసింది. ఈ టోర్నీలో మొత్తం 10 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ పూనమ్ యాదవ్ కి తుది జట్టులో చోటు ఇవ్వగా.. యువ ఓపెనర్ షెఫాలి వర్మకి 12వ ప్లేయర్ గా సరి పుచ్చింది ఐసీసీ.
నిజానికి టోర్నీ ప్రారంభంలో సంచలన ఇన్నింగ్స్ లు ఆడిన షెఫాలి వర్మ.. ఐసీసీ టీ - 20 ర్యాంకింగ్స్ లో ఏకంగా మొదటి స్థానానికి దూసుకెళ్లింది. కానీ, మెల్బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చిన్న తప్పిదంతో 2 పరుగులకే ఔటవడంతో ఆమె సంపాదించిన నెం.1 ర్యాంక్ ని చేజార్చుకోవడంతో పాటు ఐసీసీ ప్లేయింగ్ ఎలెవన్ ( మెయిన్) లో చోటు సంపాదించ లేకపోయింది. మరోవైపు పూనమ్ యాదవ్ ఫైనల్లో నిరాశపరిచినప్పటికీ టోర్నీ తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన ప్రదర్శన చేయడంతో జట్టుని గెలిపించి అందరి ప్రశంసలు అందుకుంది.
ఐసీసీ ప్రకటించిన ఉమెన్స్ టీ20 వరల్డ్కప్ జట్టు ఈ విధంగా ఉంది. అలెక్స్ హేలీ (ఆస్ట్రేలియా), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), స్కైవర్ (ఇంగ్లాండ్), హీథర్ నైట్ (ఇంగ్లాండ్), లానింగ్ (ఆస్ట్రేలియా, కెప్టెన్), లౌరా (దక్షిణాఫ్రికా), జోనసీన్ (ఆస్ట్రేలియా), సూపీ (ఇంగ్లాండ్), అన్యా (ఇంగ్లాండ్), మేగన్ స్కట్ (ఆస్ట్రేలియా), పూనమ్ యాదవ్ (భారత్), షెఫాలి వర్మ (భారత్)