ఒక వైపు కరోనా వైరస్ కారణంగా.. టోక్యో ఒలింపిక్స్ 2020 వాయిదాపై అనేక ఊహాగానాలు వినిపించాయి. కాకపోతే పరిస్థితి ఎలా ఉన్నా నిర్వహణ కోసం జరిగే సంప్రదాయ కార్యక్రమాలు మాత్రం ప్రస్తుతం యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి. ఒలింపిక్స్ లో కీలక ఘట్టమైన 'ఒలింపిక్ జ్యోతి' ఆతిథ్య జపాన్ చేతికి చేరుకుంది. గురువారం నాడు ఏథెన్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రీసు, టోక్యో 2020 నిర్వాహకులకు జ్యోతిని అందించారు. కాకపోతే ఎంతో ఘనంగా జరగాల్సిన ఈ కార్యక్రమం కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండానే పూర్తిగా ఖాళీగా ఉన్న స్టేడియంలో ముగించారు నిర్వాహకులు.
మొదటి ఆధునిక ఒలింపిక్స్ వేదిక పానెతెనాయిక్ స్టేడియంలో జ్వలింపజేసిన జ్యోతిని జపాన్ ప్రతినిధికి వారు బహూకరించారు. 1996 సంవత్సరంలో అట్లాంటా ఒలింపిక్స్ లో పోటీపడిన స్విమ్మర్ నవోకో ఇమాటో ఆ జ్యోతిని పుచ్చుకుంది. దీనితో వారు దానిని ఉపయోగించి ఆ దీపాన్ని వెలిగించారు. అయితే దీన్ని ఇక ప్రత్యేక విమానంలో జపాన్ కు తీసుక వెళ్లనున్నారు. ఆ జ్యోతిని గ్రీసులో ఒలింపిక్ జ్యోతిని వెలిగించి దాన్ని ఆతిథ్య నగరానికి ఇవ్వడం ఒలంపిక్స్ ఆనవాయితీ.
ఇలా అందించిన ఒలింపిక్ జ్యోతి శుక్రవారం నాడు టోక్యో నగరానికి చేరనుంది. ఈ టార్చ్ ని 'టోక్యో 2020 ఒలింపిక్స్ టార్చ్ రిలే' అని పెయింట్ వేసి ఉన్న తెల్ల విమానంలో జ్యోతిని అక్కడకు తీసుక వెళ్లనున్నారు. ఉత్తర జపాన్ లోని మత్సుషిమ ఎయిర్ బేస్ లో జ్యోతిని స్వాగతించడానికి కొద్ది మంది ఉన్నతాధికారులు మాత్రమే అక్కడికి వెళ్లనున్నారు. జపాన్ దేశంలో అధికారికంగా టార్చ్ రిలే ఈ నెల 26న ఫుకుషిమలో ప్రారంభమవుతుంది.