కరోనా వైరస్.. ఈ పేరు వింటేనే అందరి గుండెల్లో గుబులు పడుతోంది. కొన్ని దేశాలలో ప్రజా కదలిక పై ప్రభుత్వాలు నిషేధం విధిస్తే మరి కొన్ని చోట్ల ప్రజలు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నారు. కరోనా సోకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా , దాని పని అది చేసుకుపోతోంది. ఇక దీంతో వేగలేక.. సామాన్యులు మొదలుకుని సెలబ్రిటీల వరకు తమను తాము స్వీయ నిర్బంధంలో ఉంచుకుంటున్నారు. మొదట చైనాను అతలాకుతలం చేసిన ఈ మహమ్మారి ఇప్పుడు ఇటలీ, అమెరికా, యూరప్ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షల మందికిపైగా కరోనా వైరస్ బారిన పడగా.. 13 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
భారత్లోనూ ఈ వైరస్ ప్రభావం చూపడంతో ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూను సూచించారు. ఇక ప్రధాని పిలుపు మేరకు దేశమంతా అన్నీ బంద్ అయ్యాయి. రైళ్లు, బస్సులు, విమానాలు, షాపులు, మాల్స్, దాదాపు అన్నీ ఆగిపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటానికి 14 గంటలపాటు ఇల్లు దాటబోమని చెప్తున్నారు దేశప్రజలు. ఇదిలా ఉంటే.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఓ ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు, అతని ప్రియురాలికి సోకడం హాట్ టాపిక్గా మారింది.
వరల్డ్ ఫుట్ బాల్ ప్లేయర్ పాలో డైబాలా, అతని ప్రియురాలైన ఒరియానాలకు కరోనా వైరస్ సోకిందని ప్రకటించారు. తనకు, తన ప్రియురాలు ఒరియానాలను వైద్యులు పరీక్షించగా కరోనా వైరస్ సోకిందని తేలిందని, దీంతో తామిద్దరం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నామని క్రీడాకారుడు పాలో డైబాలా చెప్పారు. ఈ క్రమంలోనే అందరికీ హాయ్...నాకు, నా ప్రియురాలు ఒరియానాకు కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. మమ్మల్ని పరామర్శిస్తూ సందేశాలు పంపించిన అభిమానులకు అభినందనలు, మేమిద్దరం కోలుకుంటున్నాం’’ అని పాలోడైబాలా తెలిపారు.