అన్ని అనుకున్నట్లు జరిగితే ఈసమయానికి ఐపీఎల్ 13వ సీజన్ తుది దశకు చేరుకునేది. కానీ కరోనా రూపంలో ఈఏడాది ఐపీఎల్ మొత్తానికే వాయిదాపడింది. ఈ సీజన్ మార్చి 29న స్టార్ కావాల్సి ఉండగా సరిగ్గా వారం రోజుల ముందు దేశంలో లాక్ డౌన్ విధించడంతో ఏప్రిల్ 14వరకు వాయిదా వేశారు అయితే అప్పటికి కరోనా ప్రభావం ఇంకా ఎక్కువ కావడంతో ఐపీఎల్ ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దాంతో ఈఏడాది ఐపీఎల్ ఉండదని క్రికెట్ అభిమానులు ఫిక్స్ అయిపోయారు అయితే ఐపీఎల్ జరుపేందుకు ఇంకా ఛాన్స్ ఉందని తాజాగా బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు అనుష్మాన్ గైక్వాడ్ పేర్కొన్నాడు.
ఒకవేళ అక్టోబర్ లో జరగాల్సిన టీ 20 ప్రపంచ కప్ కనుక రద్దయితే అక్టోబర్ - నవంబర్ మధ్య లో ఐపీఎల్ జరిగే ఛాన్స్ ఉందని గైక్వాడ్ అన్నాడు. అది కూడా సాధ్యం కాకపోతే మాత్రం ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్ పూర్తిగా రద్దు కావడం ఇదే మొదటి సారి కానుంది అలాగే సీజన్ క్యాన్సల్ అయితే బీసీసీఐ 2000కోట్ల వరకు నష్ట పోనుంది. ఇక ఈఏడాది ఆస్ట్రేలియా లో జరగాల్సిన టీ 20 ప్రపంచ కప్ పై నీలినీడలు కమ్ముకున్నాయి . కరోనా ప్రభావం ఇంకా ఎన్ని నెలలు ఉంటుందో తెలియని పరిస్థితి ఉండడం తో ఈ మెగా టోర్నీ ని వచ్చే ఏడాది వాయిదా వేయాలని ఐసీసీ భావిస్తుంది. మరోవైపు కరోనా వల్ల ఈఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఇంకా తగ్గుముఖం పట్టకపోవడం తో క్రీడల నిర్వహణ కు ఏ దేశం కూడా ఆసక్తి చూపించడం లేదు మరో రెండు ,మూడు నెలలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం వుంది.