భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్(95) కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో మొహాలీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు(సోమవారం) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఒలింపిక్స్లో భారత్కు మూడుసార్లు స్వర్ణ పతకాలు తీసుకురావడంలో బల్బీర్సింగ్ కీలక పాత్ర పోషించారు. ఈ నెల 8 న ఆయన తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు.. కొన్ని రోజులుగా వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించిందని ఫార్టిస్ ఆస్పత్రి డైరెక్టర్ అభిజిత్ సింగ్ మీడియాకు తెలిపారు. నేటి ఉదయం ఆయన తన చివరి శ్వాస విడిచారు. ఆధునిక ఒలింపిక్ చరిత్రలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించిన 16 మంది దిగ్గజాలలో బల్బీర్ ఒకరు. ఈ ఘనత సాధించిన ఏకైక భారత అథ్లెట్, ఆసియా ఆటగాడిగా ఆయన గుర్తింపుపొందారు.
అలాగే ఒలింపిక్స్ హాకీ ఫైనల్స్ చరిత్రలో 1952లో నెదర్లాండ్స్తో తలపడిన మ్యాచ్లో అత్యధిక వ్యక్తిగత గోల్స్ సాధించిన ఘనత బల్బీర్కే దక్కింది. అంతే కాదు ఈ రికార్డు ఇప్పడి వరకు ఎవరూ చెరపలేకపోయారు. నెదర్లాండ్స్తో జరిగిన ఆ మ్యాచ్లో బల్బీర్ ఐదు గోల్స్ చేయగా.. భారత్ 6-1తో ఘన విజయాన్ని అందుకుంది. అతని కెప్టెన్సీలో భారత్ జట్టు 1956 ఒలింపిక్స్లో ఏకంగా 38 గోల్స్ చేసి అరుదైన ఘనత సాధించింది. అంతే కాదు అప్పట్లో ఈ ఆట ప్రపంచాన్ని ఉత్కంఠతకు గురి చేసింది.
ఇక 1948లో జరిగిన లండన్ ఒలింపిక్స్లో ఇంగ్లాండ్పై ఫైనల్లో 4-0 తేడాతో భారత్ గెలవడం అప్పట్లో పెద్ద సంచలనం. 1948, 1952, 1956 ఒలింపిక్స్ లో ఆడి మూడు స్వర్ణాలు తీసుకరావడంలో ఆయన పాత్ర ఎనలేదని. 1975 ప్రపంచ కప్ గెలిచిన ఇండియా హాకీ టీమ్ కు కోచ్, మేనేజర్ గా ఉన్నాడు. ఒలింపిక్స్ పురుషుల విభాగంలో హాకీ ఫైనల్స్ లో అత్యధిక గోల్స్ సాధించిన రికార్డు బల్బీర్ పేరుపైనే ఉంది. బల్బీర్ కు కూతురు, ముగ్గురు కుమారులు ఉన్నారు.