కరోనా మహమ్మారి ప్రపంచ పోకడను మార్చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు, శానిటైజర్ల వాడకం, భౌతికదూరం పాటించడం వంటి నియమాలు ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. జనజీవనమే ఇలాంటి కఠిన నియమాలతో సాగుతుంటే మరి క్రీడా టోర్నీల మాటేమిటి. అవును మీరు ఊహిస్తోంది నిజమే. టోర్నీలు ఎప్పుడు ప్రారంభమైనా కొన్ని నియమనిబంధనలు మాత్రం కచ్చితంగా పాటించాల్సిందే. రాబోయే రోజుల్లో క్రికెట్ సిరీస్ల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోతున్నాయో చూద్దాం.
కరోనా నియంత్రణలో భాగంగా ప్రజలు భౌతికదూరం పాటించడమనేది తప్పనిసరి. సామూహికంగా గుమిగూడటం లాంటివి ఉండకూడదు. అందుకే ఈ సమయంలో మ్యాచ్లు జరిగినా మైదానాల్లో ప్రేక్షకులకు అనుమతి మాత్రం దాదాపు ఉండదు. కానీ కొన్ని దేశాలు మాత్రం భారీ సామర్థ్యమున్న స్టేడియాల్లో 25 శాతం వరకు ప్రేక్షకులను అనుమతించడానికి సిద్ధమవుతున్నాయి. దీనిపై మేధావుల సలహాలు తీసుకుంటున్నాయి. ఐపీఎల్ కూడా ఖాళీ మైదానాల్లో నిర్వహించాలా లేక తక్కువ సంఖ్యలో ప్రేక్షకులకు అనుమతినివ్వాలా అనే విషయమై బీసీసీఐ చర్చలు జరుపుతోంది.
కరచాలనం రద్దు, పరిమిత సెలబ్రేషన్స్:
ఏ మ్యాచ్లయినా సెలబ్రేషన్స్ అనేవి తప్పనిసరి. క్రికెట్లోనూ ఆటగాళ్లు సంబరాలకు బాగా అలవాటు పడినవారే. కానీ కరోనా కారణంగా ఈ సెలబ్రేషన్స్కి బ్రేక్ పడనుంది. కరచాలనం పూర్తిగా రద్దవ్వగా.. ఆటగాళ్లు దూరంగా ఉండే మిగిలిన సంబరాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా థంబ్స్ అప్, బంప్స్ను ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉంది. అలాగే డ్రెస్సింగ్ రూమ్, డగౌట్లలో కూడా భౌతిక దూరం పాటించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి.
బౌండరీల వద్ద శానిటైజింగ్ యంత్రాలు:
కరోనా కారణంగా పరిశుభ్రంగా ఉండటం తప్పనిసరైపోయింది. ఏం చేసినా, ఏం చేయబోతున్నా శానిటైజర్ వాడాల్సిందే. అందుకే ఆటగాళ్లు ఆరోగ్య పరంగా రక్షణాత్మకంగా ఉండటానికి బౌండరీల వద్ద శానిటైజింగ్ యంత్రాలు ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు ఫీల్డర్లు తరచూ శానిటైజింగ్ చేసుకునే వీలుంటుంది. అలాగే డ్రింక్ బ్రేక్ సమయంలోనూ ఈ శానిటైజింగ్ ఉపయోగపడుతుంది.