కరోనా.. క్రీడా రంగం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. గత నాలుగు నెలలనుండి అన్ని క్రీడలు స్థంభించి పోగా ఇప్పట్లో పూర్తి స్థాయి క్రీడా నిర్వహణ సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఇక క్రికెట్ విషయానికి వస్తే షెడ్యూల్ ప్రకారం జరుగాల్సిన సిరీస్ లు వాయిదాపడుతున్నాయి అందులో భాగంగా శ్రీలంక ,జింబాబ్వే లతో జరుగాల్సిన సిరీస్ లను ఇండియా రద్దు చేసుకుంది.
తాజాగా ఆగస్టు -సెప్టెంబర్ లో న్యూజిలాండ్ - బంగ్లాదేశ్ ల మధ్య జరుగాల్సిన రెండు టెస్టుల సిరీస్ కూడా వాయిదాపడింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ టోర్నీ లో భాగంగా జరుగాల్సిన ఈరెండు టెస్టుల కోసం న్యూజిలాండ్ ,బంగ్లాదేశ్ లో పర్యటించాల్సి వుంది అయితే ప్రస్తుతం బంగ్లాలో కరోనా విజృంభిస్తుండడం తో ఈసిరీస్ ను వాయిదావేసుకుంది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. బంగ్లాదేశ్ లో 100000కుపైగా కరోనా కేసులు నమోదుకాగా 1500కుపైగా మరణాలు సంభవించాయి. క్రికెటర్లు కూడా ఈ మహమ్మారిని విడిచిపెట్టడం లేదు. కొద్దీ రోజుల క్రితం బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మోర్తజా తో సహా మరో ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వారు చికిత్స తీసుకుంటున్నారు.