తొలి టీ20 ప్రపంచకప్ కోసం భారత తుది జట్టులో సచిన్, ద్రవిడ్, గంగూలీకి స్థానం దక్కకపోవడానికి గల కారణాన్ని టీమ్ఇండియా మాజీ మేనేజర్ లాల్చంద్ రాజ్పుత్ వెల్లడించాడు. ఆ టోర్నీకి కేవలం యువ ఆటగాళ్లను మాత్రమే ఎంచుకోవాలని అప్పటి కెప్టెన్ ద్రవిడ్ సూచించినట్లు తెలిపాడు. టీ20 ప్రపంచకప్-2007 జట్టులో దిగ్గజ ఆటగాళ్లు సచిన్, గంగూలీ, ద్రవిడ్లకు స్థానం దక్కకపోవడం వెనకున్న కారణాన్ని తాజాగా వెల్లడించాడు మాజీ జట్టు మేనేజర్ లాల్చంద్ రాజ్పుత్.

ఈ మెగాటోర్నీలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని ద్రవిడ్ సూచించాడని.. దాని వల్ల సీనియర్ ఆటగాళ్లైన సచిన్, గంగూలీలకు అవకాశం దక్కలేదని తెలిపాడు. "అవును అదే నిజం. 2007 టీ20 ప్రపంచకప్ తుదిజట్టులో గంగూలీ, సచిన్లకు అవకాశం దక్కకపోవడానికి రాహుల్ ద్రవిడే కారణం. ఆ ఏడాది ఇంగ్లాండ్ పర్యటన తర్వాత టీ20 ప్రపంచకప్లో పాల్గొనడానికి సరాసరి దక్షిణాఫ్రికా చేరుకుంది భారత జట్టు.


 ఈ టోర్నీకి యువ ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయాలని రాహుల్ ద్రవిడ్ సూచించాడు. భారత్ ఆ ట్రోఫీ గెలిచిన తర్వాత సచిన్ బాధపడ్డాడు. ఎందుకంటే తాను చాలా ఏళ్లు జట్టుకు ఆడుతున్నాని చెబుతూ.. ప్రపంచకప్ను ఒకసారైనా గెలవకపోయానని విచారాన్ని వ్యక్తం చేశాడు". - లాల్చంద్ రాజ్పుత్, టీమ్ఇండియా మాజీ మేనేజర్



 ద్రవిడ్ సలహాతో టీ20 ప్రపంచకప్ కోసం సెలక్టర్లు కేవలం యువ ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేశారు. అందులో రోహిత్ శర్మ, రాబిన్ ఉతప్ప, శ్రీశాంత్, ఆర్పీ సింగ్తోపాటు అనుభవజ్ఞులైన ఎంఎస్ ధోనీ, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్, హర్భజన్ సింగ్లను దక్షిణాఫ్రికాకు పంపారు. ధోనీలో ద్రవిడ్, గంగూలీ లక్షణాలు కలిసి ఉన్నాయని అభిప్రాయపడ్డాడు లాల్చంద్ రాజ్పుత్. "నిజంగా చెప్పాలంటే ధోనీ చాలా శాంత స్వభావి.


 మైదానంలో నిర్ణయాలు తీసుకోవడంలో ముందుండేవాడు. ఎందుకంటే కెప్టెన్ ఎప్పటికప్పుడు నిర్ణయాలను తీసుకోవాలి. సారథిగా అతను తీసుకునే నిర్ణయాలంటే నాకు ఇష్టం. గంగూలీ, ద్రవిడ్ ఇద్దరి లక్షణాలు మహీలో ఉన్నాయి" అని వెల్లడించాడు లాల్చంద్.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: