రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజైన ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 224/3 తో మొదటి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియా.. రోహిత్ శర్మ (212: 255 బంతుల్లో 28x4, 6x6) డబుల్ సెంచరీ, అజింక్య రహానె (115 బంతుల్లో 192 బంతుల్లో 17x4, 1x6) శతకం బాదడంతో మెరుగైన స్కోరు చేయగిలింది. రెండో సెషన్ ముగుస్తుందన్న దశలో భారత్ ఇన్నింగ్స్‌ని విరాట్ కోహ్లీ 497/9‌ వద్ద డిక్లేర్ చేయగా, అప్పుడు క్రీజులో నదీమ్ (1 నాటౌట్), మహ్మద్ షమీ (10 నాటౌట్: 11 బంతుల్లో 1x6) ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జార్జ్ లిండే నాలుగు వికెట్లు పడగొట్టగా.. కగిసో రబాడ మూడు వికెట్లు, ఆన్రిచ్ నోర్తేజ్, డాన్ పైట్ తలా ఒక వికెట్ తీశారు.


ఇకపోతే ఆదివారం తొలి రెండు సెషన్ల ఆటలో రోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్ ఆటే హైలైట్‌గా నిలిచింది. ఈరోజు ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 117 తో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన రోహిత్ శర్మ.. టెస్టు కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. వ్యక్తిగత స్కోరు 199 వద్ద లుంగి ఎంగిడి బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన రోహిత్.. తర్వాత ఓవర్‌లోనే ఔటైపోయాడు. అనంతరం వచ్చిన జడేజా (51: 119 బంతుల్లో 4x4) హాఫ్ సెంచరీతో ఫర్వాలేదనిపించగా.. సాహా (24), అశ్విన్ (14) నిరాశపరిచారు. కానీ.. 9వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ఉమేశ్ యాదవ్ భారీ షాట్లతో చెలరేగిపోయాడు.


స్కోరు 450 వద్ద జడేజా ఔటవడంతో క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ (31: 10 బంతుల్లో 5x6) వరుస సిక్సర్లు బాదేశాడు. స్పిన్నర్ జార్జ్ లిండే బౌలింగ్‌‌ని లక్ష్యంగా చేసుకున్న ఉమేశ్ యాదవ్.. అతను వేసిన రెండు ఓవర్లలో ఏకంగా ఐదు సిక్సర్లు నమోదు చేశాడు. దీంతో.. భారత్ స్కోరు బోర్డు ఒక్కసారిగా పరుగులు పెట్టింది. అయితే.. ఆరో సిక్సర్ బాదే ప్రయత్నంలో లిండే బౌలింగ్‌లోనే ఉమేశ్ ఔటవగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే  కోహ్లీ.. భారత్ ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేశాడు. ఇకపోతే ఇప్పటికే భారత్ జట్టు మూడు టెస్టుల సిరీస్‌‌ని  2-0తో చేజిక్కించుకుని క్లీన్‌స్వీప్‌పై కన్నేసిందన్న విషయం తెలిసిందే. ..


మరింత సమాచారం తెలుసుకోండి: