18 ఏండ్ల నిరీక్షణకు ఈసారైనా తెరపడుతుందునుకున్న అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు తొలి రౌండ్లోనే తన పోరాటాన్ని ముగించింది. పోటీలకు తొలి రోజైన బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్ పోరులో ఐదో సీడ్ సింధు 16-21, 22-20, 18-21 తేడాతో సంగ్ జి హ్యున్(కొరియా) చేతిలో పోరాడి ఓడింది.
గత మూడు మ్యాచ్ల్లో సంగ్పై ఓడిపోవడం ఈ తెలుగు షట్లర్కు ఇది మూడోసారి. ఓవరాల్గా ముఖాముఖి పోరులో సింధు 8-6తో ఆధిక్యంలో ఉండటం విశేషం. 81 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో సింధు చాలాసార్లు అనవసర తప్పిదాలకు పాల్పడి ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకుంది. తొలి గేమ్లో 6-3తో ముందంజలో కనిపించిన సింధు...ఆధిక్యాన్ని నిలుపుకోలేకపోయింది. కొరియా షట్లర్ షాట్లను అంచనా వేయడంలో విఫలమైన సింధు వరుసగా తప్పిదాలకు పాల్పడింది.