ప్రస్తుతం ప్రపంచం మొత్తం వరల్డ్ కప్ 2019 మ్యాచ్ మానియాలో ఊగిపోతున్నారు. తాజాగా ప్రపంచకప్లో భాగంగా లీడ్స్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. మొన్నటి వరకు భారీ స్కోర్ చేస్తూ బెంబెలెత్తిస్తున్న ఇంగ్లాండ్ ఈసారి మాత్రం చిన్న స్కోర్ ని సాధించలేక చతికిల పడింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో స్వల్ప విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆపసోపాలు పడి చివరికి మరో 20 పరుగుల ముందే చేతులెత్తేసి ఓటమి పాలైంది.
శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ, ధనంజయ డి సిల్వా దెబ్బకు కకావికలైన ఇంగ్లండ్ ఓటమిని తప్పించుకోలేకపోయింది. జో రూట్ (57), బెన్ స్టోక్స్ (82—నాటౌట్)లు చెలరేగి ఆడినా ఫలితాన్ని మాత్రం దక్కించుకోలేక పోయింది. మలింగ 4, డి సిల్వా 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ను దారుణంగా దెబ్బకొట్టారు. దీంతో మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే 212 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయింది.
అంతకు ముందు శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. విష్క ఫెర్నాండో (49), కుశాల్ మెండిస్ (46), ఏంజెలో మాథ్యూస్ (85) రాణించడంతో శ్రీలంక గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మలింగకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.