భారత్ సెమీ ఫైనల్ ఓటమి తరువాత రవి శాస్త్రి చెబుతున్న కారణాలు అభిమానులకు కోపాలు తెప్పిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత అధిక వేతనం పొందుతున్న  కోచ్ టీమిండియాకే ఉన్నాడు. కుంబ్లే ఆధ్వర్యంలో జట్టు విజయపథంలో నడుస్తున్నా రవిశాస్త్రికి కోచింగ్ బాధ్యతలు దక్కాయి. ఇన్నాళ్లూ అడిగే వాళ్లు లేరు - ప్రశ్నించే వారు లేరు. కెప్టెన్  కొహ్లీతో రవిశాస్త్రికి సత్సంబంధాలు నడిచాయి. పెద్దగా పరాజయాలు లేవు.


స్వదేశంలో వన్డే సీరిస్ ను కోల్పోయినప్పుడే ఎవరైనా గట్టిగా నిలదీసి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదేమో!సెమిస్ లో పరాజయం అనంతరం రవిశాస్త్రి నాలుగో నంబర్లో సరైన బ్యాట్స్ మన్ లేకుండా పోయాడని వాపోతున్నాడు. అయితే ఈ విషయం ఇన్నాళ్లూ తెలియదా? దేశంలో యంగ్ క్రికెటర్ల లోటు లేదు! ఐపీఎల్ లో అనేక మంది యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక దేశవాళీలో కూడా బోలెడంత మంది ఆటగాళ్లు ఆడుతున్నారు.


వారిలో ఒకరిని కాకపోతే పది మందిని తీసుకుని.. వారిని జట్టు అవసరానికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవాల్సింది. ప్రత్యామ్నాయ ఆటగాళ్లను అందుబాటులో పెట్టుకోవాల్సింది.  రిజర్వ్ బెంచ్ లో పటిష్టమైన కూర్పును ఏర్పాటు చేసుకోవాల్సింది. కోచ్ గా రవి శాస్త్రి అలా చేయాల్సింది. అయితే తీరా చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది ఈయన తీరు. సెమిస్ లో వైఫల్యం అనంతరం జట్టులోని లోటుపాట్ల గురించి ఈ కోచ్ కు అర్థం అయినట్టుగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: