ఇండియా 2019 వరల్డ్ కప్ నించి సెమిస్ నుంచి తప్పుకుంది. అయితే ఇప్పుడు అందరూ ధోని రిటైర్మెంట్ ఎప్పుడు ఇవ్వబోతున్నాడని ఆసక్తికర చర్చ నడుస్తుంది. కానీ.. ఇప్పటి వరకూ ధోనీ, టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటనా వెలువడలేదు. దీంతో.. ఆగస్టులో ప్రారంభంకానున్న వెస్టిండీస్‌ పర్యటనకి ధోనీని ఎంపిక చేస్తారా..? లేదా..? అనే సందేహంలో అభిమానులు పడిపోయారు. మరోవైపు ప్రపంచకప్‌లో ధోనీ పేలవ ప్రదర్శనపై భారత సెలక్టర్లతో పాటు బీసీసీఐ కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. 


ప్రపంచకప్‌లో మహేంద్రసింగ్ ధోనీ మునుపటిలా ధనాధన్ ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేకపోయాడు. టోర్నీలో 9 మ్యాచ్‌లాడిన ఈ మాజీ కెప్టెన్ 45.5 సగటుతో 273 పరుగులకే పరిమితమవగా.. అతని స్ట్రైక్ రేట్ 87.8గా ఉండటం అతని నెమ్మది బ్యాటింగ్‌కి నిదర్శనం. ధోనీ పేలవ బ్యాటింగ్ కారణంగా లీగ్ దశలో ఇంగ్లాండ్‌ చేతిలో ఓడిపోయిన భారత్.. సెమీస్‌‌లో గెలుపు ముంగిట బోల్తా కొట్టి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.


దీంతో.. ధోనీ‌ని ఇకపై టీమ్‌లో కొనసాగించేందుకు సెలక్టర్లు ఆసక్తి కనబర్చడం లేదని బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. వెస్టిండీస్ పర్యటనకి జట్టుని ప్రకటించేలోపు ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తే సరి.. లేదంటే అతనిపై వేటు వేసి యువ క్రికెటర్లకి అవకాశాలివ్వాలనే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నట్లు ఆ అధికారి చెప్పుకొచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: