సెమీఫైనల్ లో భారత్ ఓటమి పాలవడంతో ఇప్పుడు అందరూ కోహ్లీ కెప్టెన్సీ మీద పడ్డారు.  అయితే ఒకే ఒక పరాజయం, అది కూడా స్వల్పమైన తేడాతో ఎదురైన పరాజయం అతడి కెప్టెన్సీకే ఎసరు తెచ్చేలా ఉంది! టీమిండియా కెప్టెన్ మార్పుపై బీసీసీఐ చర్చిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కొహ్లీని కేవలం టెస్ట్ కెప్టెన్సీకి పరిమితం చేసి, వన్డేలకు రోహిత్ శర్మను కెప్టెన్ గా చేయాలనే ప్రతిపాదనపై బీసీసీఐ సమాలోచనలు చేస్తోందని సమాచారం.


కొహ్లీ సారధ్యంలో టీమిండియా బాగానే రాణిస్తోంది. అయితే ఫైనల్స్ లో ఓటములు కొహ్లీకి మామూలు అయిపోయాయి. ఇదివరకూ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని కూడా ఇలాగే టీమిండియా ఫైనల్లో చేజార్చుకుంది.ఇక కెప్టెన్ గా కొహ్లీ పనికివచ్చే రకంకాదనే విశ్లేషణ మొదటి నుంచి ఉండనే ఉంది. కొహ్లీది వీరావేశం. అతడు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఆర్సీబీ జట్టు కూడా ఎంతమంది స్టార్లు ఉన్నా ఇప్పటి వరకూ ఐపీఎల్ ట్రోఫీని సాధించలేకపోయింది. అదే రోహిత్ శర్మ కెప్టెన్ గా అటు ఐపీఎల్ లో విజయవంతం అయ్యాడు. అంతర్జాతీయంగా కూడా రాణించాడు.


ఇక విదేశీ పిచ్ లపై రాణించలేడనే ముద్రనూ వరల్డ్ కప్ తో అతడు పోగొట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ కు పరిమిత ఓవర్ల కెప్టెన్సీని అప్పజెప్పాలనే వాదనకు మరింత బలం లభిస్తోంది. ప్రస్తుతానికి అయితే తదుపరి పర్యటనకు కొహ్లీ విశ్రాంతి మీద వెళ్లనున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనున్నాడు. ఆ తర్వాత సంగతి ఆ తర్వాత ఉండొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: