ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో భారత్ కు రెండు పతకాలు ఖాయం చేసారు మన క్రీడాకారులు. అద్భుత ప్రదర్శనతో సెమీస్ కు చేరి మువ్వన్నెల పతకాన్ని రెపరెపలాడించారు. తెలుగు తేజాలు పూసర్ల వెంకట సింధు.. భమిడిపాటి సాయిప్రణీత్ నిన్న జరిగిన మ్యాచ్ లలో వారి వారి ప్రత్యర్థులపై నెగ్గి సెమీఫైనల్లోకి దూసుకెళ్లి ఈ ఫీట్ సాధించారు. ఇకపోతే..
ఓ భారత షట్లర్ మెన్స్ విభాగంలో 36 ఏళ్ల తర్వాత ప్రపంచ ఛాంపియన్షిప్ పతకం అందుకోనుండటం విశేషం.భారత స్టార్ షట్లర్, ఐదో సీడ్ పీవీ సింధు.. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో 12-21, 23-21, 21-19తో రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై విజయఢంకా మోగించింది. తద్వారా ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఐదొవ పతకాన్ని ముద్దాడటానికి సిద్దమైయింది. సింధు 2017 లో కూడా రజత పతకం సాధించింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో తెలంగాణ కుర్రాడు సాయిప్రణీత్ 24-22, 21-14తో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై సంచలన విజయం నమోదు చేశాడు. ఇకపోతే.. ప్రపంచ ఛాంపియన్షిప్లో సింధు ఇప్పటికే 2 రజతాలు.. 2 కాంస్యాలు సాధించింది.
ఇప్పటిదాకా ఒకేఒక్క సూపర్ సిరీస్ టైటిల్ (సింగపూర్) నెగ్గిన సాయిప్రణీత్.. ప్రపంచ ఛాంపియన్షిప్ లో పతకంతో తన కెరీర్ను చిరస్మరణీయం చేసుకున్నాడు. ప్రకాశ్ పదుకొనె (1983లో కాంస్యం) తర్వాత పురుషుల సింగిల్స్లో ఈ ఘనత సాధించిన ఆటగాడు అతనే. ప్రపంచ ఛాంపియన్షిప్లో ఇద్దరు భారత క్రీడాకారులు సెమీస్ చేరుకోవడం ఇది రెండోసారి. 2017లో సింధు రజతం సాధించగా.. సైనా కాంస్యం గెలుచుకుంది. శనివారం జరిగే సెమీస్లో చెన్ యూఫీ (చైనా)తో సింధు, టాప్ సీడ్ కెంటొ మొమొట (జపాన్)తో సాయి తలపడతారు.