తాజాగా సౌతాఫ్రికా తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధించి 7సార్లు ఈ ఫీట్ ను సాధించిన మొదటి భారత క్రికెటర్ చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి .. ఈమ్యాచ్ ద్వారా మరో ఘనతను సాధించాడు. ఈ విజయంతో కెప్టెన్ గా తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన మూడో కెప్టెన్గా కోహ్లి గుర్తింపు పొందాడు. దక్షిణాఫ్రికా తో భారత్ రెండో టెస్ట్ లో గెలవడంతో కోహ్లి 30వ విజయాన్ని నమోదు చేశాడు. అయితే కోహ్లికిది కెప్టెన్గా 50వ టెస్టు మ్యాచ్. తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ సారథులు స్టీవ్ వా 37 విజయాలతో రికీ పాంటింగ్ 35 విజయాలతో మొదటి రెండు స్థానాల్లో ఉండగా, కోహ్లీ ఆ తర్వాత స్థానాన్ని ఆక్రమించాడు. ఇక మొదటి 50 టెస్టుల్లో 30 విజయాలు సాధించిన ఏకైక భారత కెప్టెన్ మాత్రం కోహ్లినే కావడం విశేషం. ఇంతకుముందు మాజీ సారథి ధోని భారత్ తరుపున 60టెస్ట్ మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించి 27విజయాలు అందించాడు.
ఇక భారత్ తరపున అత్యధిక టెస్టులకు కెప్టెన్లు గా చేసింది మాత్రం ధోని , కోహ్లీ లే. వీరిద్దరి తర్వాత భారత్ తరఫున ఎక్కువ టెస్టు మ్యాచ్లకు సౌరవ్ గంగూలీ సారథిగా వ్యవహరించాడు. గంగూలీ 49 టెస్ట్ మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే ప్రస్తుతం గంగూలీ ,ధోని లను మించి జట్టును విజయపథంలో నడిపిస్తూ కోహ్లీ ఉత్తమ కెప్టెన్ అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం కోహ్లీ సారథ్యం లో టీం ఇండియా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానం లో కొనసాగుతుంది.