టీం
ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటాడో అందరికి తెలిసిందే. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న సౌతాఫ్రికా టీం ను ఉద్దేశిస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా సెటైర్ వేశాడు హర్భజన్. వివరాల్లోకి వెళితే సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ కూడా ప్రస్తుతం ఇండియాలోనే వున్నాడు. ఓ యాడ్ షూట్ లో భాగంగా జాంటీ ముంబై లోని మెహబాబా స్టూడియోకు వెళ్లి ఆ షూటింగ్ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా సౌతాఫ్రికా టీమ్ జెర్సీ ని ధరించాడు. ఆ తరువాత ఆ జెర్సీ లో దిగిన ఫొటోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు జాంటీ రోడ్స్.. ఇక వెంటనే ఆ ఫోటో వైరల్ అయ్యి హర్భజన్ సింగ్ కంట పడింది. దాంతో భజ్జి ఆఫోటో పై స్పందిస్తూ ..రాంచి లో జరుగనున్న చివరి టెస్ట్ లో నువ్వు ఆడొచ్చుగా .. ప్రస్తుతం వాళ్ళకి బ్యాట్స్ మెన్ అవసరం చాలా వుంది అని కామెంట్ చేశాడు. దీనికి జాంటీ రిప్లై ఇచ్చాడు. నాకన్నా వారికీ చాలా అవసరం అని బదులు ఇచ్చాడు.
ప్రస్తుతం సౌతాఫ్రికా, భారత్ తో టెస్ట్ ల్లో తలపడుతుంది. అందులో భాగంగా ఇప్పటివరకు రెండు టెస్టులు జరుగగా రెండింట్లో చిత్తుగా ఓడిపోయి సిరీస్ ను చేజార్చుకుంది సౌతాఫ్రికా . దాంతో ఆ జట్టు ప్రస్తుత పరిస్థితి పై భజ్జి సెటైరికల్ గా కామెంట్ చేశాడు. ఇక ఈనెల 19నుండి రాంచి వేదికగా సౌతాఫ్రికా ,ఇండియా జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈమ్యాచ్ లో గెలిచి పరువు కాపాడుకోవాలని దక్షిణాఫ్రికా భావిస్తుండగా సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి నంబర్ వన్ ర్యాంక్ ను మరింత పదిలం చేసుకోవాలని భారత్ పట్టుదలతో వుంది.