క్రీడా నిబంధనలను ఉల్లంఘించి క్రీడాకారులకు తీరని అన్యాయం చేస్తున్నారని తెలంగాణకు చెందిన ఓ యువ బాక్సర్ నిఖత్ జరీన్(23) వాపోతున్నారు. ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే.. ముందు సన్నాహక పోటీల్లో(ట్రయల్స్) పాల్గొనాలని.. కానీ అవేవీ లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆమె వాపోయారు  బాక్సింగ్ విభాగంలో ట్రయల్ పోటీలు లేకుండా మేరీ కోమ్‌ను ఏకపక్షంగా ఎంపిక చేసి పంపించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

తనకంటే సీనియర్‌గా మేరీ కోమ్ పట్ల చాలా గౌరవం ఉందని..కానీ ఇలా వివక్ష చూపడం సరి కాదని  ఆమె విజయాల్ని చూస్తూ స్ఫూర్తితో పెరిగానని నిఖత్ గుర్తుచేసుకున్నారు. కానీ క్రీడా నిబంధనలను ఉల్లంఘించి మేరీ కోమ్‌ను ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపిక చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు ఆమె లేఖ రాశారు.

తెలంగాణలోని నిజామాబాద్‌కి చెందిన బాక్సర్ నిఖత్ జరీన్(23) చేసిన విజ్ఞప్తిపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు సానుకూలంగా స్పందించారు. దేశ ప్రయోజనాలు, క్రీడలు,అథ్లెట్లను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని.. ఈ విషయాన్ని బాక్సింగ్ ఫెడరేషన్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. క్రీడాకారుల ఎంపికలో మంత్రి జోక్యం ఉండదని.. సెలక్షన్ కమిటీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. అయినప్పటికీ జరీన్ ఫిర్యాదును బాక్సింగ్ ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.


కాగా, క్రీడా నిబంధనలు ఉల్లంఘించి ట్రయల్స్ లేకుండానే క్రీడాకారులను ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపిక చేయడాన్ని నిఖత్ జరీన్ తప్పు పట్టారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని.. నిబంధనల ప్రకారం ట్రయల్స్‌లో అర్హత సాధించినవారినే ఛాంపియన్‌షిప్ టోర్నీలకు,ఒలింపిక్స్‌కు ఎంపిక చేయాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు విజ్ఞప్తి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: