దేశవాళీ క్రికెట్ టోర్నీ కీలక మ్యాచ్ లకు రిజర్వు డే ఉండాలన్నా డాషింగ్ అల్ రౌండర్ యువరాజ్ సింగ్, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ లు చేసిన సూచన పట్ల బిసిసిఐ నూతన అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సానుకూలంగా స్పందించాడు. అవును ... దేశవాళీ టోర్నీ ల కీలక మ్యాచ్ లకు రిజర్వ్ డే ఉండాలని అన్నాడు . విజయ్ హజారే క్రికెట్ టోర్నీ సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం తో, పంజాబ్ జట్టు టోర్నీ నిష్క్రమించాల్సి వచ్చింది . రిజర్వ్ డే ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న యువీ, హర్భజన్ వాదన పై గంగూలీ సానుకూలంగా స్పందిస్తూనే , టోర్నీ నిబంధనలను ముందే తెలుసుకోవడం మంచిదని సూచించాడు.
న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఫలితం అనంతరం అందరూ నిబంధనలను నిందించారని కానీ నిబంధనలు ముందే తెలుసుకుని ఉంటే ప్రాథమికస్థాయి లోనే గెలుపు కోసం గట్టిగా పోటీపడుతామని చెప్పుకొచ్చాడు . నిబంధనలు ముందుగానే తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఆట ఆడడం మంచిదని హితవు పలికాడు. బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గంగూలీ పలు అంశాలపై తనదైన శైలిలో స్పందించాడు. క్రికెట్ సంఘాల్లో కి మాజీ ఆటగాళ్లు రావడం శుభసూచకమని పేర్కొన్నాడు. ధోని రిటైర్మెంట్ గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ ... ధోని ఛాంపియన్ ఆటగాడని ... రిటైర్మెంట్ గురించి అతడే నిర్ణయించుకోవాలని అన్నాడు.
జట్టు సెలెక్షన్, కోచ్ , కెప్టెన్ ఎంపిక సెలక్షన్ కమిటీ చూసుకుంటుందని చెప్పాడు. గతంలోని బీసీసీఐ అధ్యక్షుల మాదిరిగానే తాను కూడా కెప్టెన్ కు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తానని గంగూలీ చెప్పాడు . అంతిమంగా వారు మైదానంలో స్వేచ్ఛగా క్రికెట్ ఆడే వెసులుబాటు కల్పిస్తామని అన్నాడు .